ఓయులో అద్వానీ బొమ్మదగ్ధం, జెపిమీద దాడిపై కోదండ
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ వ్యాఖ్యలను నిరసిస్తూ పలువురు విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్ట్స్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎన్సిసి గేటు వద్ద విద్యార్థులు బైఠాయించారు. అద్వానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే బిజెపి మరో నేత వెంకయ్య నాయుడు తీరు పైన మండిపడ్డారు. భద్రాచలం డివిజన్లోని పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
జెపిపై దాడిపై కోదండరామ్
లోక్సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పైన దాడి విషయంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంగళవారం స్పందించారు. తెలంగాణవాదులు సంయమనం పాటించాలని, ఉద్యమానికి నష్టం చేయవద్దని, జెపిపై దాడికి తాము చింతిస్తున్నామని చెప్పారు.
మరోవైపు జయప్రకాశ్ నారాయణ పైన దాడిని నిరసిస్తూ లోక్సత్తా పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ న్యాయవాదులు చేసిన దాడికి నిరసనగా అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన చేపట్టనున్నారు. న్యాయవాదుల తీరు అనాగరికంగా ఉందని మండిపడ్డారు.