'పరకాలా! ముద్దాయి మాటలు పట్టించుకోకు, రిజైన్కు బాబు నో!': జగన్ ఏమన్నారు, ఆయన వల్లేనా?
Recommended Video

అమరావతి: ఏపీ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన అంశంపై తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. మంగళవారం రాజీనామా విషయం తెలియగానే మీడియాతో మాట్లాడారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదించే అవకాశం లేదని చెప్పారు.

ముద్దాయి మాటలు పట్టించుకోవద్దు
పరకాల టీడీపీ సభ్యుడు కాదని సోమిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో మాత్రమే భాగస్వామి అన్నారు. ఒక ముద్దాయి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు. పరకాల తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన విషయం తెలిసిందే. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.

నవ్యాంధ్ర నిర్మాణంలో పరకాల కీలక భూమిక
పరకాల ప్రభాకర్ నవ్యాంధ్ర పునర్ నిర్మాణంలో కీలకభూమిక పోషించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని వైసీపీ ఇటీవల నేతలు తప్పుబడుతున్నారు. బీజేపీ - టీడీపీ పొత్తు తెగిపోయింది. కానీ కేంద్రమంత్రిగా నిర్మలా సీతారామన్, ఇక్కడ ప్రభుత్వ సలహాదారుగా ఆమె భర్త పరకాల ప్రభాకర్ ఉండటాన్ని ఎత్తి చూపుతున్నారు.

అసలు జగన్ ఏమన్నారు?
జగన్ వ్యాఖ్యల నేపథ్యంలోనే పరకాల రాజీనామా చేసిన నేపథ్యంలో జగన్ ఏమన్నారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ పొత్తు తెగిపోయినా రెండు పార్టీలకు సంబంధించిన పదవుల్లో ఉన్న కుటుంబాలను చూపించి వైసీపీ పదేపదే టీడీపీని నిలదీస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో చోటు కల్పించడాన్ని పలుమార్లు ప్రశ్నించారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ భర్త పరకాల టీడీపీ ప్రభుత్వ సలహాదారుగా ఉండటాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇందులో భాగంగా జగన్ సోమవారం మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రిగా ఉంటారని, ఆమె భర్త పరకాల ఇక్కడ పదవిలో ఉంటారని వ్యాఖ్యానించారు.

పరకాల ప్రభాకర్ రాజీనామాకు కారణం జగనేనా?
జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలకు మనస్తాపం చెంది తాను రాజీనామా చేసినట్లు పరకాల చెప్పారు. అయితే అదే కారణమా అనే చర్చ కూడా సాగుతోంది. అందుకు కారణం ఉంది. గతంలో పరకాల ప్రభాకర రావు పలుమార్లు మీడియా ముందుకు వచ్చి విపక్షాలపై విమర్శలు గుప్పించారు. టీడీపీ - బీజేపీ పొత్తు తెగిపోయాక బయటకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవు. అందుకు సతీమణి నిర్మల బీజేపీలో ఉండటమే కారణం కావొచ్చు. అలాగే, ఇరు పార్టీల విభేదాల నేపథ్యంలో అసంతృప్తితో ఉండి ఉంటారని కూడా అంటున్నారు.

పరకాల లేక పూర్తి పాఠం
కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాటం విషయంలో ప్రజలలో అనుమానాలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పరకాల వాపోయారు. ప్రభుత్వంలో తన ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారన్నారు. తన వ్యక్తిగత బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదిస్తున్నారని పేర్కొన్నారు. నా కుటుంబ సభ్యులు వేరే పార్టీలో ఉండటంతో, నా కన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీపడతానని ప్రచారం చేయడం బాధిస్తోందన్నారు. పరిణితి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయ అభిప్రాయలకు వారు నిబద్దులు అన్నారు. వారి అభిప్రాయాల పట్ల వారికున్న బాంధవ్యాలు అడ్డురావన్నారు. రాష్ట్ర హక్కుల సాధనకు చేపట్టిన ధర్మపోరాట దీక్ష విషయంలో మీ చిత్తశుద్ధిపై నీలినీడలు పడకూడదనేది తన కోరిక అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. నా వల్ల మీకు, ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరగరాదని నా అభిప్రాయం అన్నారు. మీ మీద, ప్రభుత్వం మీద బురదజల్లడానికి లేనిపోని ఆరోపణలు చేయడానికి నా పేరు, నా కుటుంబ సభ్యుల పేర్లు ఎవరూ వాడుకోవద్దన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్నారు.












Click it and Unblock the Notifications