'గుండెలవిసేలా ఏడ్చారు.. కాల్మొక్కుతా అని ప్రాధేయపడ్డారు..' అయినా..!
అల్లిపురం : కాసుల కోసం కక్కుర్తి పడ్డ ఓ ప్రబుద్దుడి దుశ్చర్యకు కన్నపేగు తల్లడిల్లింది. గుండెలవిసేలా ఆ తల్లి చేసిన రోదన చివరికి అరణ్య రోదనగానే మిగిలిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం అన్ని కలిసి ఆ తల్లిని తన కొడుకు కడసారి చూపుకు నోచుకోకుండా చేశాయి. మీ కాల్మొక్కుతా నా కొడుకు శవమిప్పించండి అంటూ పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డ ఆ తల్లి బాధ వర్ణనాతీతం.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం అర్థరాత్రి ప్రాంతంలో వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కా జనార్దన్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే అతని కుటుంబీకులను గుర్తించే విషయంలో అంతగా శ్రద్ద వహించని పోలీసులు.. చనిపోయిన వ్యక్తి నా కొడుకే అంటూ వచ్చిన నంది అప్పారావు అనే వ్యక్తికి మృత దేహాన్ని అప్పగించారు.
రోడ్డు ప్రమాదానికి కారకులైన వారు 2 లక్షల పరిహారానికి ఒప్పుకోవడంతో, ఆ పరిహారంపై కన్నేసిన అప్పారావు చనిపోయింది తన కొడుకేనంటూ వచ్చాడు. మృత దేహాంతో పాటు డబ్బును కూడా తీసుకెళ్లిన అప్పారావు చావులమదుం స్మశానవాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించాడు.
కాగా విషయం తెలుసుకున్న జనార్దన్ అసలు తల్లిదండ్రులు శ్రీకాకుళం జిల్లా దంతేరు నుంచి నగరానికి వచ్చి మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తమ కొడుకును కడసారి చూసుకునే అవకాశం కల్పించాలని పోలీసులను బతిమాలారు.
జనార్దన్ తల్లిదండ్రుల తీవ్ర అభ్యర్థన మేరకు బుధవారం సాయంత్రం చావులమదుం స్మశాన వాటికకు తీసుకెళ్ళిన పోలీసులు, కడసారి చూపు కోసం మృతదేహాన్ని తవ్వి తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే డాక్టర్ రావట్లేదన్న కారణంతో తవ్వడం ఆపేసి తిరిగి పూడ్చేశారు.
దీంతో ఆ తల్లిదండ్రులు హృదయవిదారకంగా కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజులుగా నిద్రాహారాలు మాని కొడుకును ఆఖరి చూపు చూసుకోవాలని ఆశించిన తల్లిదండ్రులకు అధికారుల అలసత్వంతో భంగపాటు తప్పలేదు.
ఎలాగైనా మృతదేహాన్ని ఇప్పించాలని జనార్ధన్ తల్లిదండ్రులు టూ టౌన్ సీఐ పి.వి.రమణను కాళ్లావేళ్లా బతిమిలాడారు. నిబంధనలు దాటి తామెలాంటి చర్యలు తీసుకోలేమని, సాయంత్రం ఆరు గంటల తర్వాత శవాన్ని వెలికి తీయడం నిబంధనలకు విరుద్దమని, ఉదయం అప్పగిస్తామని సీఐ చెప్పారు.
కాగా దీనిపై స్పందించిన జనార్దన్ తల్లిదండ్రులు తమ కొడుకుది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే ఎవరో చంపేశారని, పోలీసులు వారికి సహకరిస్తున్నామని, అందుకే కడసారి చూపుకు కూడా నోచుకోకుండా ఎవరికో మృతదేహాన్ని అప్పగించి అంత్యక్రియలు జరిపించారని ఆరోపిస్తున్నారు.