చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ: శేషాచలం అడవుల్లో కాల్పులు
హైదరాబాద్: చెన్నై-హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్థరాత్రి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల సమీపంలో రైల్లోని 07, 10,11,12 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. 15 మంది మహిళల నుంచి బంగారు ఆభరణాలను లాక్కున్నారు. దీంతో సికింద్రాబాద్ జీఆర్పీ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, గురువారం శేషాచలం అడవుల్లో పోలీసులు కూబింగ్ జరుపుతున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులపై స్మగ్లరు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి చెందారు.
విశాఖపట్నం కేజీహెచ్ నుంచి పది రోజుల క్రితం అదృశ్యమైన శిశువు కేసును పోలీసులు చేధించారు. కేజీహెచ్లో పనిచేస్తున్న సిబ్బందే శిశువును అపహరించినట్లు పోలీసులు తేల్చారు. రూ.50 వేల కోసం శిశువును ఎత్తుకెళ్లిన ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాబును తల్లి వద్దకు చేర్చారు.
వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి యత్నించారు. ఆటోలో మిర్చి బస్తాలను తరలిస్తున్న ఇద్దరిని సెక్యూరిటీ గార్డు పట్టుకుని మిర్చియార్డు కార్యాలయంలో పట్టుకున్నారు.