అసెంబ్లీ అంటే ఏమిటో తెలుసా: జగన్కు పత్తిపాటి పుల్లారావు కౌంటర్
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు, మంత్రులకు తెలియదని జగన్ అంటున్నారని, జగన్కు అసెంబ్లీ, బడ్జెట్ అంటే ఎంటో తెలుసా? అని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ సాధ్యం కాదన్న జగన్కు ఇప్పుడు రుణమాఫీపై మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. జగన్, తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. తెలుగుదేశం, బిజెపి విడిపోవాలని జగన్ కోరుకుంటున్నారని, దాంతో కేసుల నుంచి బయటపడాలని ఆయన ఆరాటపడుతున్నారని విమర్శించారు.
రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా అధునాతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతులు ఆధునిక యంత్రపరికరాల వాడకం, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఆర్గానిక్ పంటలకు ఎక్కువ ధర వస్తుందని, ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు.