కిలాడీ లేడీ పావని అరెస్టు: మహిళల నగలను కుదువబెట్టి జల్సాలు
చిత్తూరు: కిలాడీ లేడీ పావని ఎట్టకేలకు పోలీసులకుు చిక్కింది. వడ్డీ వ్యాపారంతో పాటు చీరల వ్యాపారం చేస్తూ మహిళలను నమ్మించి మోసం చేసి పరారైన పావనిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఐదు నెలల తర్వాత ఆమె పోలీసుల చేతికి చిక్కింది. తమిళనాడులోని సేలం సమీపంలోని ఓ గ్రామంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
చిత్తూరు నగరానికి చెందిన పావని కొన్నేళ్ల నుంచి చీరల వ్యాపారంతో చిత్తూరులోని కొంత మంది మహిళలకు దగ్గరై మోసం చేసిన విషయం తెలిసిందే. వచ్చిన నగదుతో వడ్డీల వ్యాపారం కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇళ్లల్లో ఉండే బంగారు నగలను నమ్మించి వాటిని తీసుకుని కుదవ పెట్టి, వాటి ద్వారా వచ్చే నగదుకు వడ్డీలు చెల్లిస్తానని చెప్పి, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కూడబెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
మాయలేడీ పావని కేసులో ట్విస్ట్: చింటూకు ఇచ్చిన రూ. 50 లక్షలు సీజ్
అన్ని ఆభరణాలను ఓ ఫైనాన్స్ సంస్థలో కుదువపెట్టి వాటి ద్వారా వచ్చే నగదుతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె మోసాలను గుర్తించి నిలదీయడంతో ఆమె రౌడీయిజాన్ని కూడా ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూ సహాయం తీసుకున్నట్లు సమాచారం.
చింటూతో పావనికి లింక్: మాయలేడీ దందాలో బెదిరింపులు
చింటూ అండదండలతో ఆమె మహిళలను బెదిరిస్తూ వచ్చినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు నిరుడు నవంబరులో మేయర్ దంపతుల హత్యతో చింటూ జైలుకు వెళ్లడంతో మోసపోయిన బాధితులందరూ పావనిపై నిరుడు డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి పావని కనిపించకుడా పోయింది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని ఆమె నగలు కుదవపెట్టిన ఫైనాన్స్ సంస్థలోని పావని ఖాతాలను పరిశీలించారు. ఆమె పేరుతో భారీగా ఖాతాలు ఉండడమే కాకుండా, సుమారు 8 కేజీల బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. చివరకు సోమవారం సేలంలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె భర్త చరణ్ పరారీలోనే ఉన్నాడు. ఆమె చేతిలో మోసపోయినవాళ్లు తమకు ఫిర్యాదులు చేయవచ్చునని పోలీసులు చెప్పారు.