నాకూ ఓ దాహం ఉంది: మహేశ్ డైలాగ్లు చెప్పేసిన పవన్!
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజా సమస్యలపై గళమెత్తారు. కొంత మందికి భూదాహం ఉంటుందని.. వేల ఎకరాలు సంపాదించినా వాళ్లకు సరిపోదని వ్యాఖ్యానించారు.
మొత్తం ఏపీనే..
అయితే, తనకు కూడా ఓ దాహం ఉందని, ప్రజా సమస్యలను పరిష్కరించాలనేదే ఆ దాహమని పవన్ పేర్కొన్నారు. తనకు ఒక్క గ్రామం సరిపోదని.. మొత్తం అనంతపురం, మొత్తం రాయలసీమ, మొత్తం ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించాలనేదే తన తపన అని అన్నారు.
శ్రీమంతుడి డైలాగ్..
అయితే,‘శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు ఊరిని దత్తత తీసుకునే నేపథ్యంలో.. వాన్ని వీన్ని, అందర్నీ దత్తత తీసుకుంటానంటూ చెప్పిన డైలాగ్లా పవన్ వ్యాఖ్యలుండటం గమనార్హం. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అయితే, మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ డైలాగులు ఆయన ఎప్పుడు, ఎక్కడ చేశారనేది తెలియరాలేదు.
పవన్ ఆగ్రహం
రెండ్రోజుల క్రితం కూడా సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ‘ఓ వైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వరు, ఉద్యోగాలు క్రియేట్ చెయ్యరు, ఉన్నవి కూడా తీసేస్తాను అంటే కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
స్పందించాల్సిందే..
అలాగే ‘ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే లక్ష మందికి అన్యాయం జరగాలి అంటే అలా కుదరవు, ఇది 1000, 100 లేదా ఒకళ్లా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది' అని పవన్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న తాను... త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తానని గతంలో పవన్ చెప్పిన సంగతి తెలిసిందే.