45 అసెంబ్లీ సీట్లకు టిక్ పెట్టిన పవన్ కల్యాణ్: ఈ లెక్కేమిటి?
విజయవాడ: ఎన్నికల రంగంలోకి దిగుతానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటన చేసినప్పటి నుంచి ఊహాగానాలకు అంతు లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45 శాసనసభా నియోజకవర్గాల లెక్కలను ఆయన తీసినట్లు తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభా స్థానాలున్నాయి. వాటిని అన్నింటినీ తిరిగేసి ఆయన 45 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అలా ఎంపిక చేసుకోవడంలోని ఆయన ఆంతర్యమేమిటనే ప్రశ్నలు కూడా ప్రారంభమయ్యాయి.
ఎండల తీవ్రత తగ్గిన తర్వాత సెప్టెంబర్ నెలలో ఆయన తొలి విడత రాష్ట్ర పర్యటన చేస్తారని అంటున్నారు. తొలి విడత పర్యటన చేయడానికి ఆయన ఆ 45 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఏడాది తర్వాతనే ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు. అయితే, ఈలోగా ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండవచ్చునని అంటున్నారు.
సమస్యలు ఎక్కువగా ఉండి, గత రెండేళ్ల కాలంలో పనులు జరగని నియోజకవర్గాలను ఆయన ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తమకు ఆశావహులు ఉన్నారనే అభిప్రాయం ఉన్న నియోజకవర్గాలు కూడా కావచ్చుననే ప్రచారం సాగుతోంది.
థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ప్రభావం పడిన ప్రాంతాలను, అనంతపురం జిల్లాలో ఎడారిగా మారుతున్న ప్రాంతాలను పవన్ కల్యాణ్ ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను కూడా ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు కూడా ఆయన గుర్తు పెట్టినట్లు చెబుతున్నారు.