టీడీపీతో "బంధం" అఫీషియల్, పవన్ నిర్ణయంతో - ఢిల్లీ బీజేపీ నేతల గుర్రు..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. పొత్తుల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఇప్పుడు జనసేన - బీజేపీ బంధం పైన ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. చంద్రబాబును జైలుకు పంపటానికి నిరసనగా టీడీపీ బంద్ కు పిలుపు ఇచ్చింది. దీనికి జనసేన మద్దతు ఇచ్చింది. దీంతో బంద్ తో టీడీపీ -జనసేన బంధం అఫీషియల్ గా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు పొత్తులు.. రాజకీయాలకు కొత్త టర్న్ ఇస్తోంది.
చంద్రబాబుకు పవన్ మద్దతు:స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. అర్ద్రరాత్రి చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారంటూ టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చింది. ఈ బంద్ కు జనసేనాని మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష్యతో కేసులు..అరెస్ట్ లకు పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు. బంద్ లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైనా అధికారంకంగా నిర్ణయం జరగలేదు. బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏలో పవన్ భాగస్వామిగా ఉన్నారు.

టీడీపీ బంద్ తో బంధం అధికారికం:అటు బీజేపీతో అధికారికంగా పొత్తు కొనసాగిస్తున్న పవన్ ఇలా టీడీపీ బంద్ కు మద్దతు ఇవ్వటం కీలక పరిణామాలకు కారణమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండిచారు. ఆ తరువాత ఈ వ్యవహారంపైన బీజేపీ నుంచి స్పందన లేదు. చంద్రబాబు అరెస్ట్ పైన బీజేపీ జాతీయ నాయకత్వం..ఇతర జాతీయ నేతలు స్పందించలేదు. ఈ సమయంలో పవన్ తాను అప్పుడూ.. ఎప్పుడూ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. గతంలో పలు సందర్భాల్లో పవన్ కు చంద్రబాబు మద్దతుగా నిలవగా...కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాల సమయంలో చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్ సంఘీభావం ప్రకటించారు. ఏపీలో జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్ష ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పవన్ చెబుతూ వచ్చారు.
బీజేపీ నేతల ఆరా..వాట్ నెక్స్ట్:టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీని తమతో కలుపుకొని వెళ్లాలనేది చంద్రబాబు..పవన్ ఆలోచన. ఆ దిశగా అడుగులు పడుతున్నా బీజేపీ నుంచి సానుకూల స్పందన లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం పైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే..పవన్ టీడీపి అధినేత చంద్రబాబుకు మద్దతు ఉంటుందని చెప్పటం...టీడీపీ బంద్ కు మద్దతు ఇవ్వటంపైన ఢిల్లీ బీజేపీ నేతలు ఆరా తీసినట్లు విశ్వనీయ సమాచారం. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవటంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో, టీడీపీతో జనసేన బంధం ఈ బంద్ ద్వారా అఫీషియల్ గా మారుతోంది. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications