ఆ గ్యారంటీ ఇస్తే- ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోను- ఇవ్వగలరా: తేల్చేసిన పవన్ కల్యాణ్
శ్రీకాకుళం: జనసేన పార్టీ- యువ శక్తి బహిరంగ సభ జోష్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద సుమారు రెండు లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం రాత్రే విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం రణస్థలానికి బయలుదేరి వెళ్లారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా పలువురు సీినియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

పవన్ కీలక వ్యాఖ్యలు..
ఈ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారని, ఓటు మాత్రం వేయరని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ఇదే శ్రీకాకుళం జిల్లా రాజాంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే- భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని గుర్తు చేసుకున్నారు. మార్పునకు శ్రీకారం చుట్టొచ్చని తాను కలలు కన్నానని పేర్కొన్నారు. సభలకు వచ్చిన వారంతా చప్పట్లు కొట్టారు.. జేజేలు పలికారు. ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు తనకు ఓటు వేయలేదని, తన చెయ్యి వదిలేశారని అన్నారు.

వైఎస్సార్నే ఎదిరించా..
2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరఫున చేసిన ప్రచార కార్యక్రమాలను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించిన ఘనత తనకు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచెలు ఊడేలా తరిమి కొడతానని హెచ్చరించానని అన్నారు. తనను భయపెట్టాలని చూసినా, దాడులు చేసినా భయపడేది లేదని, ఎదిరించి నిలుస్తానని పేర్కొన్నారు.

మట్టి పాత్రలో అన్నం పెట్టినా తింటా..
తనకు అధికారంపై ఎలాంటి మమకారం లేదని, మట్టిపాత్రలో అన్నం పెట్టినా తింటానని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానే తప్ప అధికారాన్ని జుర్రు కోవాలనే కోరికలేవీ లేవని తేల్చి చెప్పారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడానికి కుతంత్రాలు చేస్తున్నారని, దీన్ని ప్రతి జన సైనికుడు ఎదిరించాలని పిలుపునిచ్చారాయన. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ చురకలు అంటించారు.

మళ్లీ చెప్పుల భాష..
తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే- తన జనసైనికుడి చెప్పు తీసుకుని కొడతానని, వీర మహిళ చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తనను ఇలా దుర్భాషలాడే వారిని, ఎప్పటికీ మర్చిపోనని, జన సైనికులు కూడా మర్చిపోరని, అన్నీ గుర్తు పెట్టుకుంటారని చెప్పారు.

ఖైదీ నంబర్ కూడా..
తాను కులం కోసం రాజకీయాలు చేయడానికి వచ్చిన వాడిని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ తెలుగు నేల, ఈ దేశం బాగుండాలనేది తన లక్ష్యమని, దాని కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. జైలుకెళ్లిన ఖైదీ నంబర్ 6093 కూడా తన గురించి మాట్లాడితే ఎలా? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఖైదీ నంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం తన వల్ల కాదని, పోలీసునైతే చచ్చిపోతా చెప్పారు.

ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోను..
వచ్చే ఎన్నికల్లో తాను ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోనని, గెలిపిస్తాననే గ్యారంటీ ఇవ్వగలుగుతారా? అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. అందరూ తన సభలకు వస్తారు.. జేజేలు పలుకుతారు.. చప్పట్లు కొడతారు.. వెళ్లిపోతారు. ఎన్నికలొచ్చేసరికి ఓటు వేయరు. ఇలాంటప్పుడు తనను గెలిపిస్తాననే గ్యారంటీ ఇస్తే ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోనని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. జనాలను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి దూకానని, వారే తనను మధ్యలో వదిలేశారని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications