పందుల దాడిలో గాయపడ్డ బాలుడు, విశాఖలో రైలు కింద పడి ఎస్సై ఆత్మహత్య
విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో పందులు స్వైరవిహారం చేశాయి. 13 ఏళ్ల బాలుడిపై దాడి చేసి గాయపర్చాయి. ఈ దాడి ఘటనలో గాయపడ్డ బాలుడి పరిస్ధితి విషమంగా ఉంది. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల గుంటూరు జిల్లా కాకుమానులో కుక్కల దాడిలో గాయపడ్డ ఓ బాలిక మరణించిన సంఘటన మరుకవ ముందే, ఇప్పుడు పందుల దాడిలో మరో బాలుడు గాయపడటం సంచలనం సృష్టించింది.
విశాఖలో ఎస్సై ఆత్మహత్య
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో సస్పెండ్ అయిన ఎస్సై వీరాంజనేయులు ఆత్మహత్య పట్టణంలో కలకలం రేపుతోంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న వీరాంజనేయులు తన చావుకు డీఎస్పీ రంగరాజు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావే కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు.
2013 బ్యాచ్కు చెందిన వీరాంజనేయులు 2014లో శ్రీకాకుళం జిల్లా వంగరలో ఎస్సైగా విధులు నిర్వహించాడు. పోయిన సంవత్సరం విశాఖలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో సహాయం అందించినందుకు గానూ వీరాంజనేయులు అవార్డు కూడా అందుకున్నాడు.
అవార్డు అందుకున్న మరుసటి రోజే ఏసీబీకి చిక్కి, సస్పెండ్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఎస్సై వీరాంజనేయులు మంగళవారం తన ఇంటి నమీపంలో రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నాడు. తాను నిజాయితీ పరుడినని, కావాలనే తనపై రాజకీయ లబ్ధి కోసమే అవినీతి ఆరోపణలు చేశారని వీరాంజనేయులు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
అంతేకాదు తన చావుకి కారణం ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు, డీఎస్పీ రంగరాజు వేధింపులే కారణమని అందులో పేర్కొన్నాడు.