భారీ సూట్కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'
విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరారు. విమానం నుంచి భారీ సూట్కేసులను దింపారు. వాటిని సిబ్బంది తరలించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు నుంచి ప్రారంభిస్తారు.
రెచ్చిపోయిన టీడీపీ నేతలు, దాడి
నాలుగేళ్ల పాటు మోడీని ఆకాశానికెత్తిన టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని, ఏపీకి ఎన్నడూ లేని నిధులు ఇస్తున్నారని చెప్పిన టీడీపీ ఇప్పుడు మోడీ రాకను అడ్డుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు శంకర విలాస్ సెంటర్లో బీజేపీ నేత సాంబయ్య వాహనాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. సాంబయ్య కారుపై దాడికి కూడా ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పలుచోట్ల టీడీపీ, లెఫ్ట్ పార్టీలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలు రెండు కుండలు పగులబొట్టి నిరసన తెలిపారు. మోడీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

శివాజీ పేయిడ్ ఆర్టిస్ట్, తప్పు చేసినట్లు పారిపోయాడు
మోడీ రాకను నిరసిస్తూ నటుడు శివాజీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోడీ రాకముందు నీటిలో దిగి, ఆయన వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చి నిరసన చెబుతానని అన్నారు. కృష్ణా నది దుర్గా ఘాట్లో జలదీక్ష చేస్తానని చెప్పారు. దీనిపై బీజేపీ నాయకులు ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. శివాజీ ఓ పేయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. డబ్బులు తీసుకొని పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్లే వ్యక్తి అన్నారు. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తుంటే చంద్రబాబు రాకుండా, తప్పు చేసినట్లు పారిపోయాడన్నారు.

ఆ విషయం జగన్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు
చంద్రబాబు పూటకు ఓ మాట, రోజుకో మాట మాట్లాడుతారని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. దేశ రాజకీయాలకు చంద్రబాబు చీడపురుగు అన్నారు. ఆరు నెలల క్రితం నరేంద్ర మోడీ గ్రేట్ అని చెప్పి, మోడీ లేకుంటే దేశం ఏమయ్యేదోనని చెప్పి, ఇప్పుడు ఎన్నికలకు ముందు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై బురద జల్లుతున్నారన్నారు. చంద్రబాబు చేసిన మోసాలు, అవినీతి ఎంతో ఉందని, అందులో దొరికిపోతానని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, బురద జల్లుతున్నారన్నారు. వైసీపీ పన్నిన కుట్రలో చంద్రబాబు చిక్కుకొని విలవిలలాడిపోతున్నారన్నారు. చంద్రబాబు మాటలు మారుస్తారని జగన్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు రెండో కామెడీ ఆర్టిస్ట్
ఏపీలో కేఏ పాల్, చంద్రబాబులను ప్రజలు కామెడీ ఆర్టిస్టుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రెండో కామెడీ ఆర్టిస్ట్ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని చెప్పారు. పోలవరం ప్రధాత కేంద్రం, నరేంద్ర మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications