వైజాగ్ లో పవన్ కల్యాణ్ ను కలవాలంటే ఆయన్ను కలవాలి?
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద భారీ బందోబస్తు కొనసాగుతోంది. పవన్కు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ అనుమతి లేకుండా హోటల్లోకి ఎవరినీ పంపించడంలేదు. అన్ని ద్వారాలవద్ద పోలీసులను ప్రభుత్వం మొహరించింది.

పోలీసుల అదుపులో నోవాటెల్
విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారంతా పవన్ను కలిసేందుకు నోవాటెల్ కు వచ్చే అవకాశముంది. ఇక్కడికి వచ్చే పార్టీ నాయకులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మీడియా ప్రతినిధులు మినహా హోటల్ పరిసరాల్లో ఇతరులు లేకుండా అందరినీ ఖాళీ చేయిస్తున్నారు.

పవన్ను కలవాలంటే ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందే!
హోటల్ వద్ద పోలీసులు ఆంక్షలను మరింత కఠినం చేశారు. పవన్ బస చేసిన అంతస్తు, హోటల్ కాంపౌండ్లో పార్టీకి సంబంధించినవారెవరూ లేకుండా తరిమేస్తున్నారు. ఎవరైనా పవన్ కల్యాణ్ ను కలవాలంటే ఏసీపీ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కొత్త ఆంక్షలను తెచ్చారు. పవన్ తన గదిలో పార్టీ నేతలతో సైతం ఎటువంటి సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు పోలీసులు ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

70 మందికి బెయిలిచ్చిన న్యాయస్థానం
విశాఖపట్నంలో జేఏసీ విశాఖ గర్జన పేరుతో సభను నిర్వహించింది. అదేరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో పవన్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ నాయకులు భారీసంఖ్యలో తరలివచ్చారు.
అదే సమయంలో విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు రోజా, జోగి రమేష్ తోపాటు వైవీ సుబ్బారెడ్డి తదితరులు వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడటంతో జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడంపై పవన్, నాదెండ్ల మనోహర్ పండిపడ్డారు. 92 మందిపై కేసులు నమోదవగా 70 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 61 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా 9 మందికి ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు.












Click it and Unblock the Notifications