ఫొణి సైక్లోన్ ఎఫెక్ట్ : 81 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ
విశాఖపట్టణం : ఫొణి తుఫాను ప్రభావం గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఏపీ మీదుగా వెళ్లే, ఏపీలో నడిచే 81 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. రెండు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా రైల్వే సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు పేర్కొన్నది.
ఫొణి ఎఫెక్ట్
రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో రైళ్లను రద్దుచేసినట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. మే 2న సాయంత్రం నుంచి భద్రక్ - విజయనగరం రైలుతో పాటు హావ్డా నుంచి నడిచే ఈస్ట్కోస్ట్, కోరమండల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. అలాగే, అదే రోజు రాత్రి హావ్డా నుంచి పూరీ వెళ్లే రైలును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. హావ్డా నుంచి బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు స్పష్టంచేసింది.
మరునాడు కూడా ..
తుపాను తీవ్రత దృష్ట్యా మే 3న పూరీ, భువనేశ్వర్ నుంచి నడిచే అన్ని రైళ్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 2న భువనేశ్వర్, పూరీ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాలో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఆయా మార్గల్లో రైళ్లను రద్దుచేసినందున ప్రయాణికులకు టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తామని తెలిపింది.
ఆఫీసర్స్ అలర్ట్
ఫోని అత్యంత తీవ్రమైన తుపాను కావడంతో విస్తారమైన వర్షాలు భారీగా ఈదురు గాలుల నేపధ్యంలో అధికారులు అలర్టయ్యారు. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లో మంచినీరు, విద్యుత్తు సరఫరా వంటి సహాయ చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో వెంటనే సహాయ పునరావాస చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.