జగన్కు థ్యాంక్స్ చెప్పిన కేఏ పాల్- హైకోర్టులో పిటీషన్ వేశా..!!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ- హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 1పై రాజకీయ వివాదాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏకంగా 11 మంది మరణించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఈ సభలకు హాజరయ్యే ప్రజలు మృత్యువాత పడకుండా ఉండటానికే ఈ ఆంక్షలను విధించినట్లు స్పష్టం చేసింది.

ప్రాణనష్టం జరక్కుండా..
కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైనా ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతిపక్షాల అభ్యంతరం..
దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దాన్ని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తోన్నాయి. ఇదే నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేపట్టదలిచిన పాదయాత్రతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన వారాహి బస్సు యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారనే విమర్శలు షురూ అయ్యాయి.

కేఏ పాల్ మద్దతు..
వైసీపీయేతర పార్టీలన్నీ ఈ జీవో పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో- వైఎస్ జగన్ కు అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ జీవోను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమర్థించారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించినందుకు జగన్ కు థ్యాంక్స్ చెప్పారాయన. ఇదే విషయంపై తాను హైకోర్టుకు వెళ్లానని ఆయన పేర్కొన్నారు. నడిరోడ్లపై బహిరంగ సభలను నిషేధించాలని కోరుతూ డిసెంబర్ 31, జనవరి 2 తేదీల్లో హైకోర్టులో పిటీషన్లను దాఖలు చేశానని అన్నారు.

కోవిడ్ టైమ్ లో
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వార్షిక పరీక్షలను రద్దు చేయాలంటూ తాను అప్పట్లో డిమాండ్ చేశానని, దీనికోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశానని కేఏ పాల్ గుర్తు చేశారు. అప్పుడు తనను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆ తరువాత పరీక్షలను రద్దు చేసిందని అన్నారు. బహిరంగ సభల విషయంలో మాత్రం తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకుందని వ్యాఖ్యానించారు. ఈ జీవో విడుదల చేయడాన్ని తాను స్వాగతిస్తోన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications