జనాభా పెరుగుదల సమస్యే కాదు- ఎంత పెరిగితే అంత మంచిది
Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం బుధవారమే హస్తినకు చేరుకున్నారాయన. కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు.
అమిత్ షా, నిర్మల సీతారామన్..
దాదాపుగా గంటకు పైగా అమిత్ షా- చంద్రబాబు మధ్య సమావేశం కొనసాగింది. ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు.. నిర్మల సీతారామన్ను ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

నితిన్ గడ్కరీ..
అనంతరం చంద్రబాబు ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మంజూరు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల నుంచి రోడ్ కనెక్టివిటీ కల్పించడం, ఫ్లైఓవర్ల మంజూరు, జాతీయ రహదారుల విస్తరణ గురించి మాట్లాడారు.
జనాభా పెరుగుదల..
నితిన్ గడ్కరీతో భేటీ ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుదల, ఎక్కువమంది పిల్లలను కనడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు చంద్రబాబు. ఉత్తరప్రదేశ్, బీహార్లల్లో అధిక జనాభా ఉండటం సమస్యే కాదని, స్వాగతించదగ్గ విషయమని అన్నారు. అధిక జనాభాను కలిగివుండటం దేశానికి ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.
వృద్ధుల సంఖ్య..
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వయోధిక వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. యూరప్, చైనా, జపాన్లల్లో వృద్ధుల సంఖ్యే ఎక్కువని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఎక్కువమంది పిల్లలను కనాలని అన్నారు.
డీలిమిటేషన్పై..
డీలిమిటేషన్పై తన వైఖరిని తెలియజేయడానికి ఆయన నిరాకరించారు. ఈ బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదని, ఊహాజనిత అంశాలపై వ్యాఖ్యానించబోనని అన్నారు. జన సంఖ్యను ప్రాతిపదికన ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications