ఆస్తిపన్ను పెంపు పాపం వైసీపీదే-కేంద్రం పాత్ర లేదన్న జీవీఎల్- క్షమాపణకు డిమాండ్
ఏపీలో ఆస్తిపన్ను పెంచేందుకు సిద్దమవుతున్న వైసీపీ సర్కార్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కేంద్రం నిర్ణయం ప్రకారమే తాము పన్ను పెంచాల్సి వస్తోందని చెప్తున్నారు. దీనిపై స్పందించిన బీజేపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది.
ఏపీలో పన్నుల పెంపు నిర్ణయం కేంద్రం తీసుకున్నదే అంటూ వైసీపీ, కమ్యూనిస్టులు చేస్తున్న ప్రచారం ఒట్టి అబద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అన్నారు. కేంద్రం నిర్ణయమైతే అన్ని రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఆస్తిపన్ను కేంద్ర పరిధిలోని అంశమే కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఆస్తిపన్ను పెంచలేదని ఎంపీ జీవీఎల్ గుర్తుచేశారు.

Recommended Video
ఏపీలో ఆస్తిపన్ను పెంపుపై వైసీపీ, కమ్యూనిస్టులు చెప్తున్న అబద్దాలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను పెంపుకు 15వ ఆర్ధికసంఘం ప్రతిపాదనలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రం మాత్రం ఏ రాష్ట్రంపైనా పన్నుల భారాన్ని రుద్దడం లేదన్నారు. మున్సిపాలిటీల్లో వనరులు లేని కారణంగా ఆర్ధికసంఘం పన్నుల పెంపు ప్రతిపాదించిందన్నారు. రాష్ట్రంలో పన్నులు పెంచాలని నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్రంపై రుద్దడం సరికాదని జగన్ సర్కారుకు ఆయన చురకలు అంటించారు. ఎలాగో పథకాలకు జగనన్న పేర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి పన్నుల పెంపుకు కూడా జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు అని పేర్లు పెట్టుకోవాలని ఎంపీ జీవీఎల్ సూచించారు.












Click it and Unblock the Notifications