పుష్పగరి పీఠాధిపతి శివైక్యం: రేపు దేహశుద్ధి సమాధి కైంకర్యం
హైదరాబాద్: దాదాపు 58 ఏళ్లుగా పుష్పగిరి పీఠాధిపత్యం బాధ్యతలను నిర్వర్తించిన చంద్రమౌళీశ్వర ఉపాసకులు, పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యానృసింహ భారతీ స్వామి చాతుర్మాస దీక్షలోనే శివైక్యం చెందారు. 74 ఏళ్ల విద్యా నృసింహ భారతీస్వామి కొంత కాలంగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఛాతీ నొప్పి రావడంతో మఠం సిబ్బంది హైదరాబాదులోని హైదర్గూడలోని అపో లో ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.45 గంటలకి స్వామి దేహ త్యాగం చేసినట్టు పుష్పగిరి పీఠం ఉత్తరాధికారి విద్యా శంకరభారతి తెలిపారు. పీఠాధిపతి పార్థివ దేహాన్ని భక్తులు, శిష్యుల దర్శనార్థం సోమవారం ఉదయం 10 వరకు బేగంపేటలోని పుష్పగిరి మఠంలో ఉంచి, అనంతరం కడప జిల్లా పుష్పగిరికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం దేహ సమాధి కైంకర్యం జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చెన్నూరు గ్రామం పెండ్లిమర్రి మండలం కొత్తూరు అగ్రహారంలో 1940లో శేషయ్య, భాస్కరమ్మ దంపతులకు నాలుగో సంతానంగా కైప రామమూర్తి జన్మించారు. 1957 ఫిబ్రవరి 4న రామమూర్తి తన 16వ ఏట పుష్పగిరి మఠం పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ఎనలేని సేవా తత్పరతతో పీఠం ద్వారా సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ధర్మపురి, హైదరాబాద్లలో పీఠం శాఖలను స్థాపించారు. శంకర వైభవం, పుష్పగిరి వైభవం, జనజాగృతి, వేదం- శాస్త్రం-శస్త్ర వంటి స్వామి రచనలు చేశారు. స్వామికి దేశ వ్యాప్తంగా ఉన్నతస్థాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో సహా సామాన్యుల వరకు లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు.

ఈ ఏడాది వినాయక చవితికి మృణ్మయ(మట్టి) గణనాథులనే పూజించాలని ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా పుష్పగిరి పీఠాల్లో మృణ్మయ గణనాథుల విగ్రహాలను వేల సంఖ్యలో ఉచితంగా భక్తులకు అందించి పర్యావరణ హితానికి పెద్ద పీట వేశారు. విద్యానృసింహభారతి శివైక్యంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications