పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్
తాను పొలిటికల్ పంచ్ను కొనసాగిస్తానని ఇంటూరి రవికిరణ్ స్పష్టం చేశారు. శాసన మండలిని కించపరిచేలా కామెంట్లు పెట్టారంటూ ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం, పోలీసులు ఇంటివద్ద వదిలి పెట్టి వెళ్లారు.
విజయవాడ: తాను పొలిటికల్ పంచ్ను కొనసాగిస్తానని ఇంటూరి రవికిరణ్ స్పష్టం చేశారు. శాసన మండలిని కించపరిచేలా కామెంట్లు పెట్టారంటూ ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం, పోలీసులు ఇంటివద్ద వదిలి పెట్టి వెళ్లారు.
'బాబు, లోకేష్లకు సోషల్ మీడియా భయం', కిడ్నాప్ కేసు పెట్టిన రవికిరణ్ భార్య
దీంతో ఆయన శనివారం ఉదయం శంషాబాద్లోని తన ఇంటికి చేరుకున్నారు. శాసనమండలిని కించపరిచేలా తాను ఎలాంటి పోస్టింగులూ చేయలేదన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులను సోషల్ మీడియాలో 2 నెలల క్రితం నిలదీశానని రవికిరణ్ అన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేసి, ఉగ్రవాదిని తరలించినట్లు వాహనాలను మారుస్తూ తిప్పడంలో ఆంతర్యమేమిని ప్రశ్నించారు.
ఎప్పుడు పిలిచినా..
కాగా, పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్కు సెక్షన్ 41ఏ కింద తుళ్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరయ్యేలా బైండోవర్ చేసుకుని, అతణ్ని హైదరాబాద్ తీసుకెళ్లి విడిచిపెట్టారు.
చూస్తూ ఊరుకోరు: డొక్కా
శాసన మండలి గౌరవాన్ని తగ్గించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడిన వైసిపి నేతలు క్షమాపణ చెప్పాలని టిడిపి నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ప్రభుత్వం, చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
అప్పుడు ఇలాగే బెదిరించారు
అదే పోస్టుని తాను కూడా పెడతానని వైసిపి నేత విజయసాయి రెడ్డి పోలీసులను బెదిరించడం మంచిది కాదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిల్లో ప్రభుత్వాధికారులను వైసిపి నేతలు ఇలానే బెదిరించారని, చేతనైతే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని డొక్కా సవాల్ చేశారు. అంతేగానీ సామాజిక మాధ్యమాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ప్రభుత్వం, చట్టం చూస్తూ ఊరుకోదన్నారు.
రవికిరణ్ భార్యనే చెప్పారు.. జైలుకు వెళ్లడం ఖాయం
మరోసారి ఇంటర్నెట్లో ఇలాంటి పోస్టులు కనిపిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో టిజిపి సభ్యులపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని డొక్కా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన రవికిరణ్ వైసిపి కార్యాలయంలో పని చేస్తారని ఆయన సతీమణే మీడియాలో చెప్పారని డొక్కా పేర్కొన్నారు.
ఆ పోస్టులకు సూత్రధారులు వైసిపి నేతలేననడానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేతగానివారే ఇలాంటి అడ్డదారులు తొక్కుతారని, జగన్తోపాటు విజయసాయి రెడ్డి కూడా జైలుకి వెళ్లడం ఖాయమని డొక్కా తెలిపారు.
నేనున్నా.. దండెత్తండి
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలపై అన్ని మాధ్యమాల ద్వారా ప్రజాస్వామికమైన యుద్ధాన్ని ప్రకటించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది.
ఉక్కుపాదంతో అణిచివేద్దామనే టిడిపి ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా నిర్భయంగా దండెత్తాలని సోషల్ మీడియా సైనికులకు జగన్ పిలుపునిచ్చారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం, పౌరులకు ఉన్న భావ ప్రకటన స్వాతంత్రాన్ని, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను గౌరవించే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాపై బాబు ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతిఘటించాలన్నారు.
ఏ మీడియాను అయినా ఉపయోగించండి
ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా.. ఇలా అందుబాటులో ఉన్న ఏ మీడియాలో కుదిరితే ఆ మీడియా ద్వారా చంద్రబాబు అరాచకాల మీద నిర్భయంగా, నిర్మోహమాటంగా దండెత్తాలన్నారు. టిడిపి అసత్య ప్రచారాలను వైసిపి సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. దీంతో పోలీసులను రంగంలోకి దింపారన్నారు. వైసిపి సోషల్ మీడియా కార్యాలయం మీద దాడికి దిగారని, సోదాలతో భయపెడదామనుకున్నారన్నారు.
దేశంలో ఏ ఒ్క రాజకీయ పార్టీని తీసుకున్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తీసుకున్నా సోషల్ మీడియా ద్వారా వారు చేస్తున్న ప్రచారాలు తెలిసినవే. చంద్రబాబు సిద్ధాంతం ఏమిటంటే తాను తప్పు చేసినా ఒప్పు, ఇతరులు ఒప్పు చేసినా తప్పు అని జగన్ పేర్కొన్నారు.