రాయల టీ నిజమే: షిండే, బిల్లుపై జైరాం కసరత్తు
న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రత్యామ్నాయంపై చర్చ సాగుతోందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. రాయల తెలంగాణపై రేపు మంగళవారం కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా కొట్టి పారేయలేదు. రాయల తెలంగాణ ప్రతిపాదనపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని షిండే అంటున్నారు
కాగా, తెలంగాణపై ఈ నెల 4వ తేదీన ప్రత్యేక మంత్రి వర్గ సమావేశం జరగడం లేదని సమాచారం. ఢిల్లీ శాసనసభ ఎన్నికల దృష్ట్యా మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించడం లేదని చెబుతున్నారు. గురువారంనాడు సాధారణంగా మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ అంశం మంత్రివర్గం ముందుకు వస్తుందా, లేదా అనేది చూడాల్సే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని జివోఎం అభిప్రాయపడినట్లు సమాచారం.
మంత్రి వర్గం ముసాయిదా బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి శాసనసభ ఆమోదం కోసం పంపడానికి ఎన్ని రోజులు తీసుకుంటారనే విషయంపై బిల్లు పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో చర్చకు వస్తుందా లేదా అనేది తేలుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో బిల్లు రావడం కష్టంగానే ఉంది. అయితే, పార్లమెంటు సమావేశాలను పొడగిస్తే చెప్పలేమని అంటున్నారు. రాయల తెలంగాణపై నిర్ణయం తనకు తెలియదని షిండే అంటున్నారు.

విభజన రాజకీయాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు రావడంతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు, తెలంగాణ జెఎసి నేతలు ఢిల్లీ చేరుకున్నారు. వారు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమై, హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణకే పట్టుబట్టాలని కోరారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మెజారిటీ రాయలసీమ నాయకులు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.
జివోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలంగాణ ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హోం శాఖ కార్యాలయంలో ఆయన ఆ కసరత్తు చేస్తున్నారు. రేపటి జీవోఎం ముందు ముసాయిదా బిల్లును ఉంచే అవకాశం ఉంది. సోమవారం మూడు గంటల నుంచి హోం శాఖ కార్యదర్శులతో జైరాం రమేష్ చర్చలు జరిపారు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెళ్లిపోయిన తర్వాత కూడా జైరాం రమేష్ హోం శాఖ కార్యదర్శులతో కూర్చున్నారు
ఇదిలావుంటే, విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు బిజెపి కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.












Click it and Unblock the Notifications