కొండా సురేఖతో ప్రారంభమా?: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యురాలు కొండా సురేఖ చర్చను ప్రారంభించారు. అయితే దీనిపై, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉద్యమాకారులపై తూటాలు ప్రయోగించిన కొండా సురేఖతో గవర్నర్ ప్రసంగంపై చర్చ ప్రారంభించడం సరికాదన్నారు. దీంతో అమరవీరుల కుటుంబాల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందని విమర్శించారు.
కాగా, అంతకుముందు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ శాసనసభలో చర్చ ప్రారంభమైంది. కొండా సురేఖ చర్చను ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబింబించదన్నారు. తెరాస ప్రభుత్వ కార్యాచరణ, భవిష్యత్లో అమలు చేసే పథకాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారన్నారు.
2009 సార్వత్రిక ఎన్నికల తర్వాత గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ అన్న పదమే లేదని ఈ ప్రాంత సభ్యులు ఆందోళనకు దిగామని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఓ చారిత్ర ఘట్టమన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ముందు తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన కృషిని సురేఖ గుర్తు చేశారు.
తెరాస మేనిఫెస్టోలా ఉంది: డికె అరుణ
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగం తెరాస మేనిఫెస్టోలా ఉందని కాంగ్రెస్ సభ్యురాలు డికె ఆరుణ విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. చాలా పథకాలను వల్లె వేశారే తప్ప ఎప్పట్నుంచి అమలు చేస్తారో చెప్పలేదన్నారు.
అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకుంటామని గతంలో హామీ ఇచ్చారని, అయితే ఆ ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభలో మనందరం కొలువై ఉండటానికి కారణమైన సోనియా గాంధీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపివుంటే బాగుండేదన్నారు.