అనర్హులకు ఓటు హక్కు ఎలా ఇస్తారు: టిఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులకు ఓటు హక్కు ఎలా కల్పిస్తారని తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి దారుణంగా ఉందని తీవ్రంగా మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు ఓటు హక్కు ఉండదని సుప్రీం కోర్టు చెప్పినా.. అసెంబ్లీ కార్యదర్శి ఓటు హక్కున్న వారి జాబితాలో చేర్చారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
విచారణ జరిపించి అసెంబ్లీ కార్యదర్శి సదారాంను విధుల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదని రేవంత్ రెడ్డి చెప్పారు.
తమ ఎమ్మెల్సీ సభ్యులను గెలిపించుకోవడానికి టిఆర్ఎస్ అడ్డదారిలో వెలుతోందని ఆరోపించారరు. తమకు ఈసిపై సంపూర్ణ విశ్వాసం ఉందని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ -5, కాంగ్రెస్- 1, టీడీపీ-1 నామినేషన్ వేశారు.
ఎవరూ విత్డ్రా చేసుకోకపోవడంతో ఓటింగ్ అనివార్యం కానుంది. టీఆర్ఎస్ సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత, టీటీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.