దేవుడ్ని స్మరిస్తూ రోజా ఓటు!: సిఎంకు భన్వర్లాల్ క్లాస్
చిత్తూరు/విజయనగరం: ప్రముఖ సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు రోజా బుధవారం తన ఓటు హక్కును తన నియోజకవర్గం నగరిలో వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ... తన గెలుపు ఖాయమని చెప్పారు. కాగా, ఓటు వేసిన సమయంలో రోజా దేవుడిని స్మరించినట్లుగా తెలుస్తోంది.
ఓటమిని అంగీకరించినట్లుగా ఉంది: వాసిరెడ్డి
ఓటింగ్ పూర్తికాకముందే తెలుగుదేశం పార్టీ తీరు ఓటమిని అంగీకరించినట్లుగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాదులో అన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ టిడిపి ఓటమిని ఒప్పుకుంటుందని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తోంది టిడిపియే అన్నారు.
అన్ని లోకసభ సీట్లు మావే: మేకపాటి
రానున్న సార్వత్రిక ఎన్నికలలో 150 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాలు తమవేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి కుట్రలను ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తిప్పి కొట్టాలన్నారు.
సిఎం రమేష్కు భన్వర్ లాల్ క్లాస్
టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ బుధవారం భన్వర్ లాల్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఏజెంట్ల నియామకంలో ఈసి తీరును తప్పు పడుతూ ఆయన ఫోన్ చేశారు. దీంతో భన్వర్ లాల్ ఆయనకు క్లాస్ పీకారు. పద్ధతి మార్చుకోవాలంటూ హితవు పలికారు.