ఐరన్ లెగ్, ఆంటీ, అంతు చూస్తాం.. ఇవేం మాటలు: రోజా ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సభ్యులు, ముఖ్యమంత్రి మంత్రి పీతల సుజాత తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తాను మాట్లాడుతుంటే తనను ఉద్దేశించి ఐరన్ లెగ్, ఆంటీ, అంతు చూస్తాం అంటూ మాట్లాడుతున్నారని గుర్తు చేస్తూ ఇవేం మాటలని ఆమె అడిగారు. శుక్రవారంనాడు ఆమె శాసనసభ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల మాటలను మాత్రం చూపించి, తమ హావభావాలను చూపి వీడియో క్లిప్పింగుల్లో తమ తీరును వ్యక్రీకరించారని ఆమె అన ్నారు.
అసభ్యకరంగా మాట్లాడితే తప్పు లేదట గానీ తాము యాక్షన్ చేస్తే తప్పట అని ఆమె అన్నారు. ఎస్సీలకు, మహిళలకు ఏ రోజు కూడా ఉపయోగపడని పీతల సుజాత తనపై ఎస్సీ ఎస్టీ కేసు కేసు పెడతానని అనడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. పీతల సుజాత 37 లక్షల రూపాయల విలువ చేసే వడ్డాణాన్ని బహుమతిగా పొందిందని, దానిపై తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికీ నారా లోకేష్కీ ఫిర్యాదు చేశారని ఆమె ఆంగ్లదినపత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని చూపిస్తూ ఆరోపించారు. అవినీతిపరురాలిగా సుజాత దళితులకు మచ్చ తెచ్చారని రోజా అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యకు వాడుకుంటున్నారని ఆమె అన్నారు.

తనను తిట్టడానికి చంద్రబాబు పీతల సుజాతకు మంత్రి పదవి ఇచ్చారా అని ఆమె అడిగారు. రికార్డుల్లో అసభ్యంగా మాట్లాడిన వారిని వదిలేసి సైగలు చేసినవారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. పట్టిసీమ గురించి తాను మాట్లాడుతుంటే చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని మాట్లాడుతున్నారని, అసలు చంద్రబాబుకే ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని ఆయన అన్నారు. కాలం కలిసి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, లేకుంటే పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసునని ఆమె నఅనారు. ప్రజా సమస్యల గురించి చర్చించకుండా ప్రతి ఒక్కరూ దేవినేని ఉమా మహేశ్వర రావు, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు తదితరులు తమపై దాడికి దిగుతున్నారని ఆమె అన్నారు. వారు మాట్లాడిన క్లిప్పింగులన్నీ బయటకు తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏ రోజైనా వారు ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని ఆమె అడిగారు.
శాసనసభ సమావేశాల్లోని కొన్ని దృశ్యాలను సీడీల ద్వారా విడుదల చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి తెలియకుండా వాటిని ఎలా విడుదల చేస్తారని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఆమె శాసనసభా కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎంపిక చేసిన దృశ్యాలను మాత్రమే ఎందుకు విడుదల చేశారని అడిగారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన సీడీల్లోని దృశ్యాలను వారికి ఎవరిచ్చారని అడిగారు. వాటిని అనధికారికంగా పొందారా, లేదా ఎబిఎన్ చానెల్ వారికి ఇచ్చిందా అని నిలదీశారు. అసెంబ్లీ దృశ్యాలను ఎన్టీఆర్ ట్రస్టు భవన్, టీడిఎల్పీ ఆఫీసుల్లో ఎలా విడుదల చేస్తారని అడిగారు. దీనికి స్పీకర్ అనుమతి ఉందా అని అడిగారు.
ప్రతిపక్షానికి తెలియకుండా క్లిప్పింగులను విడుదల చేసిన సంఘటనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ అందుకు స్పీకర్ అనుమతి ఇచ్చి ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ పక్షపాతి అనే విషయం అందరికీ తెలిసిందేనని రోజా అన్నారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా వీడియో క్లిప్పింగులను విడుదల చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. క్లిప్పింగులను అధికారికంగా ఇవ్వలేదనే విషయం రికార్డుల్లో ఉందని, అటువంటప్పుడు కాల్వ శ్రీనివాసులు క్లిప్పింగులను విడుదల చేయడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రోజా అన్నారు.












Click it and Unblock the Notifications