పవన్ కళ్యాణ్ను తీసుకొస్తావ్: బాబుపై రోజా, నొప్పి తగిలేలా కొట్టాలి.. మోడీపై హీరో శివాజీ
అమరావతి: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆదివారం మండిపడ్డారు. చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మగా మారాడన్నారు.
చదవండి: అతన్ని ఆంధ్రావాడివి అన్నారు!: పవన్ సంచలన 'విషయం', పార్లమెంటును ముద్దాడిన మోడీ..
వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశవ్యాప్తంగా ఏపీకి ప్రత్యేక హోదా అంసంపై చర్చ ప్రారంభమైందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందని ఆమె వెల్లడించారు.
చదవండి: లగడపాటి పుట్టిన రోజు ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్: ఏం జరుగుతోంది?
పవన్ కళ్యాణ్ను తీసుకు వచ్చి పక్కదారి
టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరని రోజా ప్రశ్నించారు. కలుగులో దాక్కున్న ఎలుకలా చంద్రబాబు వేడుక చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తెరపైకి తెచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
మోడీ మాటలు నమ్ముతూ వచ్చాం కానీ
ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని నటుడు శివాజీ వేరుగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పారని, వాటిని ఇంతకాలం నమ్ముతూ వచ్చామని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఎంతో చేసిందన్నారు. కానీ బీజేపీ మాటలతో పబ్బం గడుపుతోందన్నారు.
నొప్పి తగలేలా దెబ్బ కొట్టాలి
పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని శివాజీ అన్నారు. ఎక్కడ మనకు అవమానం జరిగిందో అక్కడే మనం పోరాడాలని ఆయన వ్యాఖ్యానించారు. నొప్పి తగిలేలా దెబ్బకొట్టాలని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
బీజేపీపై మూకుమ్మడి దాడి
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. బీజేపీపై మూకుమ్మడి దాడి జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీనే కారణమని చెప్పారు. బీజేపీ నేతలు అబద్దాలు, అవాస్తవాలు చెబుతున్నారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఇచ్చిన రుణమాఫీ హామీని కేంద్రం ఎందుకు భరిస్తుందని ప్రశ్నించారు. రుణమాఫీ లెక్కలు కూడా రెవెన్యూ లోటుగా చూపారని, డీపీఆర్లు లేకుండా కేంద్రంరూ.2500 కోట్లు ఏపీకి ఇచ్చిందన్నారు.