పండుగ పూట ప్రజలపై రూ. 350 కోట్ల ఆర్టీసి చార్జీల మోత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) ప్రజలపై భారం మోపింది. దసరా పండుగ పూట ఆర్టీసి చార్జీలను పెంచుతూ ప్రకటన వెలువడింది. శుక్రవారం అర్దరాత్రి నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చేశాయి. గ్రామీణ ప్రాంతాలలో తిరిగే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ చార్జీలపై 5 శాతం, ఎక్స్ ప్రెస్ నుంచి గరుడా ప్లస్ వరకు అన్ని రకాల బస్సులపై 10 శాతం పెంచారు.
దానివల్ల తెలుగు వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులపై కిలోమీటర్కు 3 పైసలు పెరిగాయి. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ సర్వీసులపై కిలోమీటర్కు 8 నుంచి 9 పైసల వరకు చార్జీలు పెరిగాయి. వెన్నెల స్లీపర్ సర్వీసు చార్జీలు మాత్రం యథాతథంగా ఉంటాయి. తాజా పెంపువల్ల ఆర్టీసీకి రూ.350 కోట్ల ఆదాయం అదనంగా సమకూరుతుంది.
తమపై పడుతున్న భారంతో పోలిస్తే ఇది కూడా ఏమాత్రం సరిపోదని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు శుక్రవారం విజయవాడలో మీడితో అన్నారు. సీఎం ఆదేశాల మేరకు విద్యార్థుల బస్ పాసులు మాత్రం పెంచడం లేదన్నారు. ఏటా రూ. 660 కోట్ల జీతాల భారం, రూ.400 కోట్ల వరకు పల్లె వెలుగుల ద్వారా నష్టం వస్తోందని, అదనంగా వచ్చే రూ.350 కోట్లు కూడా సరిపోవని, ఇంతకంటే పెంచేందుకు సీఎం అంగీకరించకపోవడంతో విధిలేక 5 శాతం మాత్రమే పెంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ప్రతి రోజూ ఒక్కో పల్లెవెలుగు సర్వీసుపై రూ.3 వేలు నష్టం వస్తోందని ఆయన చెప్పారు. ఇతర సర్వీసుల్లో వచ్చే లాభాలను పల్లె వెలుగులపై మళ్లిస్తున్నామనిస గ్రామీణ ప్రజలు, విద్యార్థులపై అదనపు భారం పడకుండా చూశామని చెప్పారు.
ఏపీఎ్సఆర్టీసీ రూ.600 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ ఏడాది కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల, సూపర్వైజర్లు, అధికారులు, ఉన్నతాధికారులు తాము సొంతంగా పే రివిజన్ చేసుకోవడం వల్ల సంస్థపై అదనంగా రూ. 660 కోట్ల భారం పడింది.