నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ అనాలసిస్: ఆందోళనకరంగా టీడీపీ గ్రాఫ్..!!
యువ గళం పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ చేస్తోన్న విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై తాజాగా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోందీ యాత్ర. దీని తరువాత ఆయన అనంతపురం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా జిల్లాకు చెందిన మంత్రులు, ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపైనా నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తోన్నారు. ఇవి కాస్తా రాజకీయ వేడిని రాజేస్తోన్నాయి.

గ్రాఫ్ ఎలా ఉంది..?
ఇన్ని రోజుల పాదయాత్రలో నారా లోకేష్ ఏం సాధించారు? టీడీపీ గ్రాఫ్ ఎలా ఉందనే విషయంపై ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. లోకేష్ పాదయాత్రకు భారీగా జనం తరలి వస్తోన్నారని టీడీపీ చెబుతోండగా.. దీన్ని కొట్టి పారేస్తోంది అధికార పార్టీ. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోందని, దీన్ని జాకీలేసి పైకి లేపే ప్రయత్నాలను అనుకూల మీడియా చేస్తోందంటూ చెబుతోంది.

బైరెడ్డి ఏమన్నారంటే..
తాజాగా లోకేష్ పాదయాత్రపై స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఏపీ, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్పందించారు. లోకేష్ ను ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా అభివర్ణించారు. మనిషిగా కూడా ఫెయిల్యూరేనంటూ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ వైఖరి రోజురోజుకూ దిగజారుతోందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావడం కష్టమేనని జోస్యం చెప్పారు.

పాదయాత్ర సభల్లో..
పాదయాత్ర సభల్లో మహిళలు ముఖ్యమంత్రి జగన్ కు జై కొడుతున్నారంటూ కొన్ని సంఘటనలను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉదహరించారు. నారా లోకేష్ తన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాలని సూచించారు. నగరికి వెళ్లి రోజాను విమర్శిస్తోంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక మహిళా అని కూడా చూడకుండా రోజా ఇంటిపై దాడి చేయిస్తోన్నాడని ధ్వజమెత్తారు. రోజాను జబర్దస్త్ ఆంటీగా సంబోధించడాన్ని టీడీపీ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని బైరెడ్డి అన్నారు.

భ్రమల్లో బతకొద్దు..
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భ్రమల్లో బతకొద్దని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని బైరెడ్డి సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసి, వాటిని తమ అనుకూల మీడియా ద్వారా నిజం అని భ్రమించేలా చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మట్లేదని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు, లోకేష్ లాంటివారిని శాశ్వతంగా రాజకీయం నుంచి దూరం చేయాలని సూచించారు. చంద్రబాబు లాంటి నాయకులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

స్కాం బయటపెడతాం..
నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని, సీనియర్లు సైతం ఇప్పుడు తలపట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2014-2019 మధ్యకాలంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం పేరిట కోట్ల రూపాయలను చంద్రబాబు, నారా లోకేష్ దోచుకున్నారని బైరెడ్డి ధ్వజమెత్తారు. ఈ ఒప్పందం పేరిట డొల్ల కంపెనీలను తెరిచారని, 250 కోట్ల రూపాయలను వాటికి మళ్లించారని గుర్తు చేశారు. వందల కోట్ల రూపాయలను మాయం చేసిన చంద్రబాబు తన పేరును జాదూ బాబుగా మార్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications