నల్లగా ఉంటే ఇంత వివక్ష!, అమెరికాలో కాదు ఏపీలోనే: ఓ చిన్నోడి నిరసన..
స్కూల్లో తోటి విద్యార్థులంతా కర్రోడా.. నల్లోడా!.. అంటూ తనను హేళన చేస్తున్నారని వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మంత్రాలయం: చదువుకోవాల్సిన వయసులో వివక్ష వెన్నాడటం చిన్నారుల మనసులను ఎంతగా కలవరపెడుతుందో తెలియజెప్పే ఘటన ఇది. చీటికి మాటికి తన ఒంటి రంగును హేళన చేసి మాట్లాడే తోటి విద్యార్థుల మధ్య ఆ చిన్నోడు తీవ్రంగా కలత చెందాడు. దీంతో స్కూల్ అంటేనే అతనికి ఏహ్య భావం పుట్టింది.
అయినా సరే.. స్కూల్ కు వెళ్లాల్సిందే అంటూ తల్లిదండ్రులు పట్టుబట్టడంతో.. ఏం చేయాలో తోచని స్థితిలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రనగర్ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రనగర్కు చెందిన పోనని వీరేశ్ అనే విద్యార్థి మంగళవారం నాడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. 30అడుగుల ఎత్తున్న ఆ ట్యాంక్ పై నుంచి 'నేను బడికి పోను' అంటూ అరుస్తూ చెప్పాడు. దాదాపు గంట సమయం పాటు వీరేశ్ ఎవరెంత నచ్చజెప్పినా మెత్తబడలేదు. చివరకు పోలీసులు వచ్చి బుజ్జగించడంతో వీరేశ్ కిందకు దిగాడు.
స్కూల్లో తోటి విద్యార్థులంతా కర్రోడా.. నల్లోడా!.. అంటూ తనను హేళన చేస్తున్నారని వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications