సెక్షన్ 8 తప్పనిసరి, ట్యాపింగ్ గుట్టు తేలుతుంది: రాజప్ప, టీ నేత మద్దతు
హైదరాబాద్: హైదరాబాదులో సెక్షన్ 8 పైన తాము ఏం చెబుతున్నామో అటార్నీ జనరల్ కూడా అదే చెప్పారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప మంగళవారం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సరైన సమయంలో ఆధారాలు బయటకు వస్తాయని చెప్పారు. ప్రజలు మంచిపాలన కోరుకుంటారనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రహించాలని హితవు పలికారు. శాంతిభద్రతల పరిరక్షణకు గవర్నర్ ఇకనైనా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సెక్షన్ 8 అమలు మాత్రం హైదరాబాదులో తప్పనిసరి అన్నారు. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.
కేసీఆర్ గిల్లికజ్జాలు: రాజారామ్ యాదవ్
గిల్లికజ్జాలు పెట్టుకునే రీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత రాజారాం యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య ఈ పరిస్థితికి కేసీఆరే కారణమని ఆరోపించారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉందన్నారు.
సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ సీఎస్, డీజీపీ
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 16 రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో ఎస్సీ కమిషన్ భేటీ కానుంది. ఆ సదస్సులో వీరు పాల్గొంటారు. ఇదే సమయంలో సెక్షన్ 8 అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శితో చర్చించనున్నారని తెలుస్తోంది.