అమరావతి రైతులకు ఎదురుదెబ్బ-లంచ్ మోషన్ పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు
అమరావతి రైతులకు ఇవాళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాదయాత్రపై రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దీంతోపాటు వారికి ఓ కీలక సూచన కూడా చేసింది. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో క్లారిటీ కోరుతూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి రైతులు ఒకే రాజధాని కోరుతూ అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పాదయాత్ర వెళ్లే మార్గాల్లో వైసీపీ కార్యకర్తలు నల్ల బెలూన్లతో నిరసనలకు దిగుతున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా పాదయాత్రను కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ తర్వాత పాదయాత్ర చేసే వారు నిబంధనలకు కట్టుబడి ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పాదయాత్ర చేస్తున్న వారిని మరింత కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఐడీ కార్డులు చూపిస్తేనే యాత్రకు అనుమతిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు మరోసారి క్లారిటీ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు లంచ్ మోషన్ పిటిషన్ లో నిరాకరించింది. అయితే రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని వారికి సూచించింది. దీంతో వచ్చే మంగళవారం రెగ్యులర్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications