గుంటూరులో కలరా మరణాలపై చర్యలు...బాధ్యులైన ఉద్యోగుల సస్పెన్షన్
గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీళ్లు తాగి 10 మంది మృతి చెందటం...నగరవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో వందలమంది చికిత్సలు పొందుతుండపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు బాధ్యులైన ఏడుగురు మున్సిపల్ సిబ్బందిపై వేటు వేసింది.
బాధితులను పరామర్శించటానికి బుధవారం రాత్రి జీజీహెచ్కు వచ్చిన అమాత్యులు పుల్లారావు, ఆనందబాబు ఈ ఘటనకు బాధ్యులైన యంత్రాంగంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం 24 గంటల్లోనే దీనికి బాధ్యులైన ఇద్దరు ఏఈలతో పాటు ట్యాప్ ఇన్స్పెక్టర్లు, ఫిట్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏడుగురుపై సస్పెండ్ వేటు వేసింది. మరో ఇద్దరు డీఈలను నగరంలోని వేరే ప్రాంతాలకు బదిలీ చేసింది. వన్టౌన్ ప్రాంతంలో తాగునీటిని పర్యవేక్షిస్తున్న కార్యనిర్వాహక ఇంజినీర్ను ఈఎన్సీకి సరెండర్ చేశారు.
దీంతో భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం అయితే వేటు తప్పదని, విధి నిర్వహణలో అలక్ష్యంగా ఉంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని సంకేతాలు పంపినట్లు అయింది. గత ఐదు రోజుల నుంచి గుంటూరు నగరాన్నిడయేరియా వణికిస్తోన్న సంగతి తెలిసిందే. మురుగునీటి కాల్వల కింద తాగునీటి పైపులైన్లు ఉన్నా ఏ మాత్రం పట్టించుకోకుండా నీటి సరఫరా చేయటం, ఈ క్రమంలో పైపులైన్లకు లీకేజీలు ఏర్పడి డ్రైనేజీ నీరు కలిసినా, ఆ సంగతి తెలియక ఈ నీరు తాగిన నగర వాసులు గత ఐదు రోజుల నుంచి అతిసారం బారినపడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు చికిత్స కోసం పోటెత్తుతున్నారు.
గురువారం పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్వలవన్ గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ స్టేడియం, ఎల్బీనగర్ రిజర్వాయర్ల పరిధిలో కలుషిత నీళ్లు సరఫరా అవుతున్నాయని స్థానికులు కొందరు ఆ ప్రాంతంలో పర్యటించిన కరికల్వలవన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పరిశీలనలో కూడా మురుగుకాల్వల్లో తాగునీటి కొళాయి కనెక్షన్లు ఉండటం, ఇదంతా క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్వాకమేనని ఒక అంచనాకు వచ్చి బాధ్యులైన యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఎనిమిది మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది.
మరోవైపు నగరంలో మురుగునీటి కాల్వల కింద ఉన్న పైపులైన్లను మార్చే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నగరంలో ఇంకా ఎక్కడైనా మురుగుకాల్వల్లో పైపులు, కొళాయి కనెక్షన్లు ఉన్నాయా అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారు. నగర కమిషనర్ అనురాధ ఉన్నతాధికారులతో కలిసి అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కాచివడపోసిన నీళ్లనే తాగాలని సూచనలు చేశారు. మొత్తానికి నగర ప్రజలు కొంచెం అప్రమత్తమయ్యారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. గురువారం నుంచి డయేరియా మరణాలు నిలిచినా అతిసార బాధితులు మాత్రం జీజీహెచ్, ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లటం మాత్రం కొనసాగుతూనే ఉంది.