మోడీతో జగన్ భేటీ చంద్రబాబుకు షాక్: చిక్కుల్లో నారా లోకేష్?
జగన్ను చంద్రబాబు ఆర్థిక ఉన్మాదిగా అభివర్ణిస్తున్నారు. తనకు అత్యంత సన్నిహతమని భావిస్తున్న ప్రధాని మోడీ జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయనకు షాక్ తగిలే విషయమే....
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇరువురి మధ్య భేటీ జరగడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే విషయమే. జగన్తో భేటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించబోయే వ్యూహానికి సంకేతంగా భావిస్తున్నారు.
అవసరమైతే చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుని జగన్తో వెళ్లడానికి బిజెపి సిద్ధపడినట్లు కనిపిస్తోందని అంటున్నారు. మోడీతో జగన్ భేటీ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతాయనే సంకేతాలను ఇచ్చినట్లుందని అంటున్నారు.
చంద్రబాబుతో తెగదెంపులు చేసుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తే చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా చిక్కుల్లో పడే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోడీతో భేటీ తర్వాత జగన్ మాట్లాడిన తీరు ఆ విషయాన్ని వెల్లడిస్తోందని భావిస్తున్నారు.

ఆర్థిక ఉన్మాదిగా....
వైఎస్ జగన్ను తెలుగుదేశం పార్టీ ఆర్థిక ఉన్మాదిగా అభివర్ణిస్తోంది. అవినీతి సొమ్ముతో పత్రికను, చానెల్ను పెట్టాడని వ్యాఖ్యానిస్తూ వస్తోంది. జగన్పై చంద్రబాబు కూడా అదే రీతిలో దుయ్యబడుతూ వస్తున్నారు. ఈ స్థితిలో అవినీతిపరుడైన జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం ఏమిటని తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తుపోవచ్చు. కానీ మోడీ ఆలోచన మరో రకంగా ఉండే అవకాశం లేకపోలేదు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో జగన్తో కలిసి పోటీ చేయడానికి సిద్దపడవచ్చు.

భేటీ ఇందుకే అని చెప్పినా...
ఎపికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం వంటి విషయాలను జగన్ ప్రధాని దృష్టికి తెచ్చినట్లు, అదే సమయంలో తమ పార్టీ నుంచి ఫిరాయించినవారికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అయితే, అంత మాత్రమే అయితే చంద్రబాబుకు కలిగే నష్టమేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు బిజెపితో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అయితే, బిజెపి మరో విధంగా ఆలోచించడానికి అనువైన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నట్లు మోడీతో జగన్ భేటీని అభివర్ణిస్తున్నారు.

వెంకయ్య నాయుడి ద్వారానే...
చంద్రబాబుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి మద్దతు దండిగా ఉందనే విషయం అందరికీ తెలుసు. వెంకయ్య నాయుడే బిజెపికి, చంద్రబాబుకు మధ్య వారధిగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబుకు బిజెపి సన్నిహితంగా మెలగడానికి, చంద్రబాబుతో స్నేహం కొనసాగించడానికి వెంకయ్య నాయుడి ప్రోద్బలం ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే, వెంకయ్య నాయుడిని మాత్రమే చంద్రబాబు నమ్ముకున్న స్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మరో కోణంలో ఆలోచించే అవకాశాలు కూడా లేకపోలేదు. అందులో భాగంగానే జగన్తో బిజెపి సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉండవచ్చు కూడా.

పవన్ కల్యాణ్ కారణం కూడా....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను పక్కన పెట్టాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తమను లక్ష్యం చేసుకుని చేస్తున్న వ్యాఖ్యల పట్ల బిజెపి అధినాయకత్వం చాలా గుర్రుతో ఉన్నట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తీరు మోడీకి కూడా రుచించడం లేదని అంటున్నారు. మరో ముఖ్య విషయం కూడా పవన్ కల్యాణ్ను వదులుకోవడానికి కారణమని అంటున్నారు. పవన్ కల్యాణ్ వెనక చంద్రబాబు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు విమర్శించీ విమర్శించనట్లు విమర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. అది కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపి అధినాయకత్వం ఆలోచించడానికి కారణమని అంటున్నారు.

పూర్తిగా మోడీకి మద్దతు...
మోడీతో భేటీ తర్వాత వైయస్ జగన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే రాజకీయ కోణం అర్థమవుతుంది. ఆయన పూర్తిగా మోడీకి మద్దతు ఇస్తున్నట్లు అర్థమైపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి నిలబెట్టే అభ్యర్థి గెలుస్తాడు, బిజెపికి ఆ మేరకు మద్దతు ఉంది, అలాంటప్పుడు పోటీ పెట్టడం ఎందుకు అని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏం ఆలోచిస్తున్నారో తెలియదని, రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికైతే బాగుంటుందని, అందువల్ల మోడీ ఎవరు చెప్తే వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. దీన్ని బట్టి, మోడీతో నెయ్యానికి జగన్ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకున్నారని అనుకోవాల్సి వస్తోంది.

నారా లోకేష్పై బాంబు....
నారా లోకేష్ను చిక్కుల్లో పడేసే మాట కూడా వైయస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో లోకేష్పై కూడా ఆరోపణలు ఉన్నాయని అంటూ అందువల్ల సిబిఎ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయం కూడా ఆయన మోడీకి చెప్పే ఉంటారని భావించాల్సి ఉంటుంది. చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తే బిజెపి ఆ దిశగా పావులు కదిపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తం మీద, జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం చంద్రబాబుకు షాక్ ఇచ్చే విషయమేనని చెప్పాలి.

పురంధేశ్వరి ద్వారానే....
జగన్కు బిజెపికి మధ్య సయోధ్య కుదర్చడానికి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబుతో తీవ్రమైన విభేదాలున్న పురంధేశ్వరిని ముందుకు పెట్టడం ద్వారా కూడా బిజెపి నాయకత్వం చంద్రబాబుకు షాక్ ఇస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జగన్తో బిజెపి కలిసి వెళ్లడానికి అనువైన మార్గం ఏర్పాటు చేయడానికే జగన్, పురంధేశ్వరి మధ్య, ఆ తర్వాత రోజాకు, పురంధేశ్వరికి మధ్య మంతనాలు జరిగాయని భావించడానికి వీలవుతోంది.












Click it and Unblock the Notifications