దుమారం: రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మ దగ్ధం, కేసు
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యల పైన తీవ్ర దుమారం రేగుతోంది. వినాయకుడిని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్లో పలువురు నిరసన చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న రామ్ గోపాల్ వర్మ పైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
సరూర్ నగర్లో కేసు
రాం గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్మ వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కరుణసాగర్ అనే లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వర్మపై 153ఏ, 505, 298, 504 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
కాగా, రామ్ గోపాల్ వర్మ పైన పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర నవనిర్మాణసేనకు చెందిన సుమిత్ కంభేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పానావాలా తదితరులు వేర్వేరుగా కేసులు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ (హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ) నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైదరాబాద్, గోవా, విజయవాడ, ఔరంగాబాద్ తదితర పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి.