జగన్ స్ట్రాటజీ.. చంద్రబాబు బలహీనపడకుండా... సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు...
ఏపీ సీఎం వైఎస్ జగన్,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోడు దొంగలు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అవినీతిపై పెద్ద పుస్తకాన్ని ప్రచురించిన వైసీపీ... ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు బలహీనపడితే మరొకరు పైకొస్తారన్న ఉద్దేశంతోనే జగన్ ఆయన అవినీతి గురించి మాట్లాడట్లేదన్నారు. జగన్-చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని... ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు.
రాయలసీమకు ఏం చేశారు...
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాయలసీమకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఎలాగైతే కేంద్రం నుంచి యుద్దప్రాతిపదికన నిధులు తెచ్చుకోవాలని భావిస్తున్నారో... రాయలసీమ అభివృద్దిని కూడా యుద్దప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాయలసీమకు రూ.10వేలు కోట్లు కేటాయించాలని... రాబోయే మూడేళ్లలో ఇక్కడి అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాయలసీమపై రెఫరెండానికి సిద్దమా...
అమరావతిలో రాజధానిపై రెఫరెండానికి సిద్దమా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారన్న సోము వీర్రాజు.. వైసీపీ,టీడీపీలు రాయలసీమ అభివృద్దిపై రెఫరెండానికి సిద్దమా అని ప్రశ్నించారు. రాయలసీమలో రెఫరెండం పెడితే ప్రజలు ఏం చెప్తారో తెలుస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.7200కోట్లు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇసుక దొరకడం కష్టమైపోయిందన్నారు. ప్రభుత్వ విధానాలతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.
బీజేపీతోనే అభివృద్ది... : సోము వీర్రాజు
కర్నూలు జిల్లాలోని డీఆర్డీవో ద్వారా రాబోయే రోజుల్లో 4వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు అందించనున్నామని సోము వీర్రాజు తెలిపారు. అలాగే నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చేసేందుకు ఎంతో ఆస్కారం ఉందని... బీజేపీ వల్లే అది సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో బీజేపీ-జనసేన కలిసి ముందుకు సాగుతాయన్నారు.