కత్తులు పదునెక్కుతాయి - సోము వీర్రాజు సంచలనం : పవన్ టీడీపీ పొత్తు వేళ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన లాంఛనమే. ఇప్పటి వరకు బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఉన్నా నామమాత్రంగానే ఉంది. విశాఖలో ప్రధానితో పవన్ భేటీ తరువాత వచ్చే ఎన్నికల్లో బీజేపీ - జనసేన పొత్తు ఖాయమని కాషాయం పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు జనసేన - టీడీపీ పొత్తు ఖాయమైంది. బీజేపీ వైఖరి స్పష్టం కావాల్సి ఉంది. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యల పైన సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో ఢిల్లీ లో ముఖ్య నేతలతో భేటీ ఖరారైంది. బీజేపీ ఏపీలో ఏం చేయబోతోంది..ఏం జరుగుతోంది..

కత్తులు పదునెక్కుతున్నాయంటూ..
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రణస్థలం సభలో పొత్తుల పైన మాట్లాడారు. టీడీపీతో పొత్తు ఖాయమనే బలమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు. టీడీపీ అధినేత బీజేపీతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతలు అందుకు సిద్దంగా లేరు. పవన్ పొత్తు పైన దాదాపుగా తేల్చేసిన వేళ..ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. రేపటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీలో మారుతున్న రాజకీయాలు.. కొత్త పొత్తుల పైన ఇప్పటికే బీజేపీ ముఖ్య నేతలు ఆరా తీసారు. పవన్ రాజకీయ అడుగుల పైన స్పష్టత తీసుకున్నారు. టీడీపీతో వెళ్లాలని పవన్ డిసైడ్ కావటంతో..ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఏపీలో ఎటువంటి రాజకీయానికి సిద్దం అవుతుందనేది ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో పవన్ మరింత స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని..అప్పుడు అందరి కత్తులు పదునెక్కుతాయని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి.

టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా
తెలంగాణలో తాము బీజేపీకి సహకరించాలని..అదే సమయంలో ఏపీలో బీజేపీ తో పొత్తు ఖరారు చేసుకోవాలనేది టీడీపీ వ్యూహం. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము ఒంటరిగానే పోరాటం చేస్తామని ప్రకటించారు. బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ కంటే తెలంగాణ రాజకీయంగా కీలకం. ఏపీలో ప్రధాన పార్టీలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. తెలంగాణలోనే టీడీపీతో పొత్తు వద్దని చెబుతున్న బీజేపీ..ఏపీలో కూడా అదే విధానం అనుసరించే అవకాశం కనిపిస్తోంది. అయితే, టీడీపీ - బీజేపీ మధ్య సత్సంబంధాల కోసం పవన్ చొరవ తీసుకుంటారని చెబుతున్నారు. తమతో పొత్తులో కొనసాగుతూ టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న పవన్ మాటను బీజేపీ నాయకత్వం పరిగణలోకి తీసుకుంటుందా అనేది మరో సందేహం. బీజేపీ వైఖరి పైన స్పష్టత వచ్చిన తరువాతనే అధికారికంగా పొత్తు ప్రకటన చేయాలనేది టీడీపీ - జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.

బీజేపీ రాజకీయ అడుగుల పై ఆసక్తి..
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికార మిత్రపక్షంగా ఉన్న జనసేన రూటు మారుతోంది. ఏపీలో వైసీపీతో మైత్రి ఉన్నా.. పొత్తు కాదు. ఏపీలో టీడీపీ స్థానంలో తాము ఎదగాలనేది బీజేపీ వ్యూహం. ఇందుకోసం కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. పవన్ సహకారంతో ఏపీలో క్రమేణ పట్టు సాధించాలని బీజేపీ భావించింది. పవన్ తమను కాదని టీడీపీతో వెళ్తున్న వేళ..ఇప్పుడు బీజేపీ కూడా ఆ రెండు పార్టీలతో కలుస్తుందా.. లేక, ఇప్పటికంటే భవిష్యత్ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని వైసీపీకి పరోక్ష సహకారిగా నిలుస్తుందా అనేది ఆసక్తిగా మారుతోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ ముఖ్య నేతలతో సోము వీర్రాజు భేటీ కానున్నారు. అక్కడే ఏపీకి సంబంధించి పార్టీ రోడ్ మ్యాప్ ఖారరయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications