పరీక్షే, బాబుకు థ్యాంక్స్: సాయికుమార్, 'నాడు ఇంద్రుడు, నేడు చంద్రుడు'
అమరావతి: ఏపీ రాజధాని శంకుస్థాపనకు యాంకరింగ్ చేసే అవకాశం లభించడం, తన జీవితంలో లభించిన పెద్ద వరమని సాయికుమార్ అభివర్ణించారు. తన గొంతును తండ్రి అందిస్తే, అందుకు అసలైన గౌరవం ఇప్పుడు లభించిందన్నారు.
తనకన్నా ముందే హీరో అయిన రాజధాని శంకుస్థాపన కార్యకర్మాన్ని... తన స్వరంతో విజయవంతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. నలభై ఏళ్ల తన ప్రస్థానంలో ఇప్పటి వరకూ చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తైతే, మాతృభూమి రుణం తీర్చుకునేలా దక్కిన ఈ అవకాశం ఒక ఎత్తన్నారు.
ఈ అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకో పరీక్ష వంటిదన్నాడు. ప్రజల అభిమానం, పెద్దల ఆశీర్వాదం, కనకదుర్గమ్మ కటాక్షంతో, చరిత్రలో ఈ కార్యక్రమం నిలిచి పోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, సాయికుమార్తో పాటు సునీత యాంకరింగ్ చేస్తున్నారు.

రాజేంద్ర ప్రసాద్ కితాబు
అమరావతి శంకుస్థాపనకు మన మట్టి-మన నీరుఅనే కాన్సెప్ట్ చాలా బాగుందని మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ కితాబిచ్చాడు. బుధవారం ఉదయం శంకుస్థాపన వేదిక వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు తేవడం తనను ఉద్వేగానికి గురి చేసిందన్నారు.
పుట్టిన తర్వాత, జన్మలో మరచిపోలేని సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే అందులో ఒకటి రాజధాని శంకుస్థాపనగా గుర్తుండి పోతుందన్నారు. పురాణాల్లో అమరావతిని ఇంద్రుడు పాలిస్తే, ఈ అమరావతిని మన చంద్రుడు నిర్మిస్తున్నాడన్నారు. ఇది నభూతో నభవిష్యతి అన్నారు.
ట్రయల్ రన్, పవిత్ర జలం జల్లిన బాబు
అమరావతి నగర శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తున్నందున హెలికాప్టర్ల ట్రయల్ రన్ నిర్వహించారు. ఉద్దండ రాయనిపాలెం హెలిపాడ్ లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ దిగింది. శంకుస్థాపన ఏర్పాట్లను చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అనంతరం పవిత్ర జలం, మట్టిని రాజధాని ప్రాంతంలో చల్లారు.












Click it and Unblock the Notifications