ఐబి వార్న్: దాడులపై ఎర్రబెల్లి, ఏడ్చిన నన్నపనేని
తెలంగాణ ప్రాంత నేతలు అందరూ భేటీ అయ్యారు. ఈ భేటీకి మొదటిసారి హైదరాబాదు శాసన సభ్యులు, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సభ్యులు అందరు ఈ రోజు సభలోనే ఉండాలని, సీమాంధ్ర నేతలు ఇబ్బందులు సృష్టిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బిల్లు పైన ఓటింగ్ జరగకుండా చూడాల్సి ఉందన్నారు.
టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు పైన ఓటింగ్ పెడితే శాంతియుతంగా ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భౌతిక దాడులకు దిగవద్దని, అలా దిగిదే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే మైకులు లాగే ప్రయత్నాలు చేద్దామన్నారు. కానీ, దాడులకు పాల్పడితే తెలంగాణకే నష్టమని హితవు పలికారు. ఆయన వాదనతో అందరు ఏకీభవించారు.
ఓటింగ్కు అవకాశం ఉంటే అందరం అప్రమత్తంగా ఉండాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. మరోవైపు సీమాంధ్ర నేతలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. సభలో ఓటింగ్ జరగడం తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు. కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన గడువు ముగియడంతో టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
కాగా, ఓటింగ్ జరిగితే అసెంబ్లీలో ఎలాంటి అనుకోని పరిణామాలైనా జరగవచ్చునని, భౌతిక దాడులకు ఆస్కారముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.