కాలర్ పట్టుకున్న తెలంగాణ లాయర్లు, కిందపడిన జెపి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ న్యాయవాదులు లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారు. జెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జెపి గోబ్యాక్ అంటూ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ న్యాయవాదులతో పాటు తెలంగాణవాదులు జెపి వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, తోపులాటలో జయప్రకాష్ నారాయణ కిందపడిపోయారు. కొంత మంది ఆయన కాలర్ పట్టుకున్నారు.
పోలీసులు జెపి చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. జెపిని పోలీసులు ఎపి భవన్ నుంచి బయటకు తీసుకుని వెళ్లారు. దీంతో ఎపి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణపై జెపి వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. జెపి మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా తెలంగాణవాదులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకున్నారు.

తెంలగాణవాదుల ఆందోళనతో ఆయన మాట్లాడడం ఆపేసి నించున్నారు. అయితే, తీవ్రమైన తోపులాట చోటు చేసుకుంది. తాము సూచించిన సవరణల్లో రెండింటిని మాత్రమే కేంద్రం అంగీకరించిందని జెపి చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. తాము సూచించిన ప్రతిపాదనలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని ఆయన కోరారు. విభజనకు ముందే సమస్యలను పరిష్కరించాలని, అన్ని ప్రాంతాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు.
సమస్య తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య ఉంది కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ మనుగడ సాగించలేదని, అలాగే సీమాంధ్ర పరిస్థితి కూడా ఉందని ఆయన అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలను వెనకబడిన ప్రాంతాలుగా గుర్తించాలని ఆయన అన్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని, దాని వల్ల నదీ జలాల పంపకం సమస్యతో పాటు ఇతర సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.
పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టే ఉన్నాయని, సీమాంధ్రలో ఉపాధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. సీట్లు, ఓట్ల కోసం రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. ఓట్లను, సీట్లపై మాత్రమే దృష్టి ఉంటే తెలుగు ప్రజలకు అశనిపాతం అవుతుందని జెపి అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ఎత్తుగడలో భాగంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications