ఘోర రోడ్డు ప్రమాదం.. నోట్లో ఇరుక్కుపోయిన స్టీరింగ్, ఇద్దరు మృతి
అతి వేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో ఏడుమందిని క్షతగాత్రులను చేసింది. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తిరుపతి నుంచి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాహన డ్రైవర్ సుబ్బారావు, మరో వ్యక్తి పడవల సాయిశంకర్ మృతి చెందారని, మృతులిద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేర్కొన్నారు. కారులో ఎయిర్ బ్యాగ్స్ కూడా లేనట్లుగా తెలుస్తోంది. అందువల్లే డ్రైవర్తో పాటు ముందు వైపు కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ నోట్లో స్టీరింగ్ ఇరుక్కుపోయి ఉండడాన్ని గమనించవచ్చు.