హీరో బాలకృష్ణ పీఏ పైన టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
అనంతపురం: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. హిందూపురం శాసన సభ్యుడు, తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ పీఏ పైన పలువురు తెలుగు తమ్ముళ్లు బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ పీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
చిలమత్తూరులో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశం రసాభాసగా మారింది. ఎంపీపీ, బ్రహ్మానంద రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో బాలకృష్ణ పీఏ పైన బ్రహ్మానంద రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు: రఘువీరా
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. డీజిల్, పెట్రోలు పైన అదనపు ట్యాక్స్లు వేస్తున్నారన్నారు.
కొల్లేరు కాంటూరు కుదింపుపై సుప్రీంకు వెళ్తాం: నారాయణ
పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు కాంటూరు కుదింపుపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని సీపీఐ నాయకుడు నారాయణ చెప్పారు. కాంటూరు కుదింపు వ్యవహారంపై పార్లమెంటులో బిల్లు వస్తే దాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తోడు దొంగలన్నారు. వారు కలిసి టీ తాగుతూ ఫోటోలు దిగుతారని, అనంతరం బయట పరస్పరం విమర్శించుకుంటారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, చంద్రబాబులు బాబులు కలిసి ప్రజలకు పంగనామాలు పెడుతున్నారన్నారు.