పవన్ వారాహి యాత్రకు టీడీపీ మద్దతు-గాంధీ జయంతి రోజు భువనేశ్వరి దీక్ష-బాలకృష్ణ ప్రకటన
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇవాళ నంద్యాలలో భేటీ అయింది. చంద్రబాబును స్కిల్ స్కాంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీకి ఢిల్లీ నుంచి వర్చువల్ గా నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు.
ఇవాళ జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.చంద్రబాబుపై పెట్టిన కేసులపై స్పందిస్తూ.. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని బాలయ్య తెలిపారు. మేలుకో తెలుగోడా!!అనే నినాదంతో ముందుకు వెళతామన్నారు. జనసేన,టిడిపి కలిసి ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ రేపటి నుంచి చేపడుతున్న వారాహి నాలుగో దశ యాత్రకు టీడీపీ తరఫున మద్దతు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు బాలకృష్ణ తెలిపారు. తెలుగు దేశం కార్యకర్తలు,అభిమానులు పవన్ వారాహి యాత్రలో సంపూర్ణంగా పాల్గొంటారన్నారు. జనసేనతో కలిసి ఇప్పటికే క్షేత్రస్ధాయిలో టీడీపీ క్యాడర్ పనిచేస్తున్నప్పటికీ వారాహి యాత్రలో మాత్రం అధికారికంగా తొలిసారి ఇరుపార్టీలు కలిసి పాల్గొనబోతున్నాయి.
అలాగే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి రోజు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలకృష్ణ వెల్లడించారు. అలాగే ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా పోరాడుతాయని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications