జగన్ కు కష్టాలే..చంద్రబాబు అంచనాలివే: జనసేన..బీజేపీ పొత్తుపై: పార్టీ నేతలకు దిశా నిర్దేశం..!
ఏపీలో కొత్త పొత్తుపైన టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. బీజేపీ..జనసేన మధ్య పొత్తు అధికారికంగా ఖరారు కావటం పైన ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ పొత్తు ఏ రకంగా ప్రభావం చూపుతుందనే అంశం పైన చర్చించారు. ఈ పొత్తు టీడీపీకి ఏ రకంగా లాభ..నష్టాలు కలిగిస్తుందనే అంశం పైన చర్చించారు. ఈ కొత్తు పొత్తు పైన మౌనం వహించాలని పార్టీ నిర్ణయానికి వచ్చింది. అదే సమయంలో సుదీర్ఘ చర్చల తరువాత పార్టీ అధినేత కీలక అంచనాకు వచ్చారు. తమ పాత మిత్రులైన ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలవటం కారణంగా తమతో జత కట్టకపోయినా..ముఖ్యమంత్రి జగన్ కు కష్టాలు తెచ్చి పెడుతుందనే అంచనాకు వచ్చారు. బీజేపీ వైఖరి ఎలా ఉండే అవకాశం ఉందనే దాని గురించి పార్టీ నేతలకు చంద్రబాబు వివిరించారు.
జగన్ ను టార్గెట్ చేస్తారు..
బీజేపీ..జనసేన పొత్తు పైన టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త విశ్లేషణ తెర మీదకు తెచ్చారు. ఈ రెండు పార్టీల పొత్తు కారణంగా సీఎం జగన్ కు కొత్త చిక్కులు తప్పవని టీడీపీ అంచనాకు వచ్చింది. అమరావతి నుండి రాజధాని తరలింపు అంశంతో పాటుగా జగన్ మీద ఉన్న కేసుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవతాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. జగన్ కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని టీడీపీ అధినేత సమక్షంలో జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి ఎన్నికల ముందు నుండే జగన్ సహకారం పొందారని..ఇప్పుడు జనసేనతో పొత్తు కారణంగా ..ఏపీలో ఆ రెండు పార్టీలు బలపడేందుకు అడుగులు వేస్తాయని..ఆ క్రమంలో జగన్ కు ఉచ్చు బిగిసేలా ఢిల్లీ నుండి కార్యాచరణ అమలయ్యే అవకాశం ఉంటుందంటూ పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే, జనసేన, బీజేపీ కలయికపై మౌనం వహించాలని నిర్ణయించారు.

అమరావతి విషయంలోనూ..
రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున.. పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పట్టవచ్చని.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అమరావతి విషయంలో జనసేన, బీజేపీ కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బీజేపీ సొంతంగా ఉద్యమం చేపట్టడమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదంటూ టీడీపీ అధినేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. అమరావతి విషయంలో రెండు పార్టీల నేతలు తమ అభిప్రాయాన్ని పొత్తు సమావేశంలోనే స్పష్టం చేసారు. ఇక, అమరావతి తరిలింపుకు చాలా అడ్డంకులు ఏర్పడతాయని.. రాజధాని ఉద్యమం తీవ్రతరమవుతుందనే అంచనాకు టీడీపీ నేతలు వచ్చారు. ముందుగా అమరావతి అంశం మీదనే ఫోకస్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications