చంద్రబాబుకు ప్రధాని ఫోన్ - చైనా వివాదంపై సలహా కోరిన మోడీ ? - ఫేక్ ట్వీట్లపై బాబు అసహనం...
గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా లాక్ డౌన్ సమయంలో సలహాల రూపంలో ప్రధాని మోడీ ఓసారి ఫోన్ చేశారు. దీనిపై అప్పట్లో టీడీపీ వర్గాల సంతోషం అంతా ఇంతా కాదు. వెతుకుతున్న తీగ కాలికి తగిలితే అన్న చందాన బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలో మోడీయే ఆయనకు ఫోన్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు కదా. అందుకే ఈ విషయాన్ని చంద్రబాబు కూడా గర్వంగా చెప్పుకున్నారు.
తాజాగా ఇదే కోవలో చైనాతో భారత్ కు సరిహద్దు వివాదం చోటు చేసుకుంది. ఇందులో పరిస్ధితి తీవ్రమై 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయే వరకూ వచ్చింది. దీంతో చైనాతో భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందే టీడీపీ అధినేత చంద్రబాబుతో మోడీ ఫోన్ కాల్ లో మాట్లాడారని, చైనా వివాదంపై అనుసరించాల్సిన వ్యూహంపై సలహాలు తీసుకున్నారని ట్విట్టర్ లో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీన్ని తొలుత లైట్ తీసుకున్న టీడీపీ... ఆ తర్వాత వీటి సంఖ్య పెరగడంతో సీరియస్ అయింది. అధినేత చంద్రబాబు దృష్టికి కూడా ఈ విషయం వెళ్లింది.
ఓ పక్క ప్రధానితో అఖిలపక్ష భేటీకి కాల్ రాక ముందే చంద్రబాబుతో ప్రధాని మోడీ తనకు వ్యక్తిగతంగా కాల్ చేశారన్న ట్వీట్లు చంద్రబాబుకు మంటపుట్టించాయి. ఈ పేక్ ట్వీట్ల వ్యవహారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను చేయని ట్వీట్లను మార్ఫింగ్ లతో తనకు ఆపాదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇలా ఫేక్ ట్వీట్లతో దుష్ప్రచారం చేస్తారంటూ తాజాగా ట్వీట్ చేశారు. తద్వారా ఆయన అభిమానులకు, టీడీపీ కార్యకర్తలు, నేతలకు క్లారిటీ ఇచ్చారు.