చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత.. రాళ్ల దాడి.. పోలీసుల లాఠీఛార్జి!!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబు రామకుప్పం మండలం కొల్లుపల్లిలో పర్యటించారు. ఆయన పర్యటించే మార్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జెండాలు, పార్టీ గుర్తుకు సంబంధించిన తోరణాలు ఏర్పాటు చేశాయి. వైసీపీ నాయకులు ఈ తోరణాలకు ఆనుకొని వారి పార్టీవి కూడా ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.
Recommended Video
ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిగా నినాదాలు చేశాయి. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడురోజుల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. ఇన్ని సంవత్సరాల్లో తాము ఎప్పుడూ వైసీపీ నాయకుల్ని టచ్ చేయలేదని, ఇప్పుడు తమ నాయకుల్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కుప్పం అంటే పులివెందుల కాదని, ధర్మానికి ధర్మం.. న్యాయానికి న్యాయమని, రౌడీయిజం చేస్తామంటే వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని హెచ్చరించారు. పోలీసులు ఒక రాజకీయ పార్టీతో కాలు దువ్వుతున్నారని.. ఖబడ్ధార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు.