వద్దు, ఇవ్వాలి: ఆ పార్టీల్లో జివోఎం చిచ్చు,బాబుపై ఒత్తిడి
హైదరాబాద్: అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలలో మంత్రుల బృందం(జివోఎం) చిచ్చు రాజేసింది. జివోఎంకు నవంబర్ 5వ తేదీ లోగా రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలు నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆయా పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. లేఖలు ఇచ్చే విషయమై ఇరు పార్టీల్లో రగడ రాజుకుంటోంది.
జివోఎం విభజన తర్వాత వచ్చే సమస్యల పైన అభిప్రాయాలు చెప్పాలని సూచించింది. అంటే విభజనపై నిర్ణయం తీసుకున్నందున సమైక్యాంధ్ర అనకుండా కేవలం సమస్యల పైనే అభిప్రాయాలు చెప్పాలి. ఇదే ఇప్పుడు ఇరు పార్టీల్లోని తెలంగాణ, సీమాంధ్ర నేతల రగడకు ఆస్కారమైంది.
కేంద్రం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున లేఖలు ఇవ్వాలని, సీమాంధ్రుల సమస్యలు అందులో చెప్పుకోవచ్చునని తెలంగాణ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో సీమాంధ్ర నేతలు మాత్రం లేఖలు ఇవ్వవద్దని, అభిప్రాయాలు చేబితే విభజన అంగీకరించినట్లే అవుతుందని అంటున్నారు.
విభజన పైన అభిప్రాయం చెప్పమంటే ఏమైనా చెప్పవచ్చునని కానీ, విభజన తర్వాత వచ్చే సమస్యలపై చెప్పాలని సూచించినందున స్పందిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు.
విభజన విషయంలో కాంగ్రెసు పార్టీలోనే సమన్వయం లేదని, ఆ పార్టీ ముఖ్యమంత్రి మాటననే కాంగ్రెసు వినడం లేదని అలాంటప్పుడు జివోఎంకు మెయిల్స్ పెడితే లాభమేమిటని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తు తరాల ప్రయోజాల కోసమే తమ తపన అన్నారు.
రెండు నెలల్లో పోయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడమేమిటని, ఆంటోని కమిటీ రాష్ట్రానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విభజనపై తమ అభిప్రాయం చెప్పామని, అధినేతే నిర్ణయం తీసుకుంటారని బొజ్జల అన్నారు. జివోఎంకు నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని తాము చెప్పామన్నారు.
బాబుపై సీమాంధ్ర నేతల ఒత్తిడి
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సీమాంధ్ర పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు నేతలు పార్టీ స్టాండ్ సమైక్యమంటూ కేంద్రానికి లేఖ రాయాలని, తమ స్టాండ్ ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందే తాము ప్రజలకు చెబుతామని సూచించారు. అయితే బాబు మాత్రం వారి మాటలను మౌనంగా విని ఊరుకున్నారు.
ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తాం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పైన తాము అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.