‘లోకేశ్ కలియుగ అభిమన్యుడు: ఏపీ గురించి జగన్కేం తెలుసు?’
గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై ప్రశంశల వర్షం కురిపిస్తూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. లోకేష్.. కలియుగ అభిమన్యుడని ఆయన కొనియాడారు.
పద్మవ్యూహాన్ని చేధించడం లోకేశ్కు తెలుసని అన్నారు. పక్కరాష్ట్రాల్లో జీవించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు ఏపీ ప్రజల గురించి మాట్లాడే అర్హతలేదని బుద్దా వెంకన్న విమర్శంచారు.
అంతేగాక, లక్ష్మీ పార్వతి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కూడా మండిపడ్డారు. హరికథలు చెప్పే లక్ష్మిపార్వతిపై, బుర్రకథలు చెప్పే బొత్సపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
వారు చెల్లని చెక్కులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స, అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి చెల్లని చెక్కు లాంటి వారని టిడిపి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు విమర్శించారు. క్రమశిక్షణ కు మారుపేరైన టీడీపీని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి పదవులు ఆశించకుండా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. మైసూరా, సబ్బంహరితో సహా 20 మంది ఎమ్మెల్యేలు జగన్ వైఖరితో పార్టీని వీడిన విషయం వాస్తవం కాదా? అని ఆనందబాబు, వడ్లమూడి పూర్ణచంద్రరావు ప్రశ్నించారు.