జమిలివల్ల అధికారంలోకి వస్తామనే నమ్మకం వాళ్లల్లో ఏ మూలో ఉంది- టీడీపీ ఎమ్మెల్యే
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ నిర్వహణ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి వడివడిగా అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ను నిర్వహించబోతోన్నామనే సంకేతాలను పంపించింది.
గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కూడా.

పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 2027లో ఏ క్షణంలోనైనా వన్ నేషన్- వన్ ఎలక్షన్కు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
దీనిపై తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండి శాసన సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. జమిలి ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
తనకు అందిన సమాచారం ప్రకారం జమిలి ఎన్నికల కోసం బీజేపీ చిత్తశుద్దితో ఉందని రఘురామ అన్నారు. బీజేపీలో కూడా తనకు చాలామంది మిత్రులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్పై కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని చెప్పారు.
జమిలి ఎన్నికలు జరిగితే తాము అధికారంలోకి వస్తామనే నమ్మకం వారిలో ఏమూలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కూడా ఒప్పుకొంటే పార్లమెంట్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ఓటింగ్ రొటీన్గా అయిపోవచ్చని రఘురామ పేర్కొన్నారు. 2027లో జమిలి రావొచ్చని, ఈ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటనేది తనకు తెలియదని చెప్పారు.
జమిలి ఎన్నికలను ప్రతిపాదించిందే బీజేపీ కావడం, ఎన్డీఏ సంకీర్ణ కూటమి సభ్యుడు కావడం వల్ల చంద్రబాబు ఆటోమేటిక్గా మద్దతు ఇస్తారని రఘురామ పేర్కొన్నారు. 2027 ఫిబ్రవరిలో జమిలికి వెళ్తే దానికి ఆరునెలల ముందు కొత్త అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలను కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు.
రాష్ట్రంలో అసెంబ్లీల సంఖ్య ఇప్పుడున్న 175 నుంచి 225కు పెరుగుతాయని అన్నారు. తన అంచనా ప్రకారం జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, దీనివల్ల తాము అయిదు సంవత్సరాల అధికారం కోసం పడిన కష్టం రెండున్నరేళ్ల పాటే ఉంటుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications