భారత విద్యార్థులపై అమెరికా లక్ష డాలర్ల ఫీజు- OPT కి కోలుకోలేని దెబ్బ
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిడం ఇక గగనం కానుంది. అత్యున్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి, అక్కడే ఉద్యోగం చేయాలని భావిస్తున్న విద్యార్థులకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇవ్వబోతోన్నారు. కోర్సును పూర్తి చేసిన అనంతరం అమెరికాలోనే ఉంటూ అక్కడే ఉద్యోగాలను పొందడానికి వీలు కల్పించే అన్ని రకాల వీసాలపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజును విధించాలని భావిస్తోన్నారు. దీనికి సంబంధించి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలను రూపొందిస్తోంది.
ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా ప్రభుత్వ ప్రతిపాదనను అక్కడి కోర్టు ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే ఎఫ్-1 స్టూడెంట్ వీసా విభాగమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) లపై ఈ భారాన్ని మోపాలని భావిస్తోన్నట్లు ఆ కథనం తెలిపింది.

భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో ఈ ఓపీటీ అత్యంత కీలకం. దీని కింద విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత మూడేళ్ల పాటు అమెరికాలోనే ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ ఈ ఓపీటీ లభించకపోతే.. చదువు ముగిసిన వెంటనే విద్యార్థులు అమెరికాను వదిలి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే చదువు పూర్తయిన తర్వాతే అమెరికాలోనే ఉంటూ ఉద్యోగ అవకాశాలను వెదుక్కుంటుంటారు.
అమెరికా ఐటీ కంపెనీలు మెజారిటీ నియామకాలను స్థానిక యూనివర్శిటీల నుంచే చేపడుతుంటాయి. ఈ నియామకాలన్నీ కూడా ఎక్కువగా ఓపీటీ పైనే ఆధారపడి ఉంటాయి. గతంలో హెచ్-1బీ రూల్స్ను వ్యతిరేకించిన టెక్ కంపెనీలు దీన్ని కూడా వ్యతిరేకిస్తోన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీస్ లెక్కల ప్రకారం 2024లో దాదాపు 4.19 లక్షల మంది విదేశీయులు ఓపీటీ ప్రాతిపదికన అమెరికాలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో ఉన్నది భారతీయులే.
చదువు పూర్తయిన విద్యార్థులకే కాకుండా, అమెరికా వెలుపల ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారిని కూడా కట్టడి చేయడానికి ట్రంప్ యంత్రాంగం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు లక్ష డాలర్ల విలువైన బాండ్ను సమర్పించేలా నిబంధనను తీసుకుని రావాలని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు భావిస్తోన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తోన్నారు.
ఈ బాండ్ కింద చెల్లించే నిధులు.. వారు మళ్లీ అమెరికాకు చేరుకుని, అక్కడ పౌరసత్వం పొందిన తర్వాత మాత్రమే తిరిగి అందుతాయి. దీనిపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి స్పందించారు. ప్రభుత్వ విధానాలు అధికారికంగా విడుదలయ్యే వరకు వేటినీ తుది నిర్ణయాలుగా పరిగణించలేమని పేర్కొన్నారు. అమెరికా చట్టబద్ధ వలస విధానంలో లోపాలను తొలగించడానికిప్రభుత్వ పరిధిలోని అన్ని మార్గాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా ఆయా ప్రతిపాదనలన్నీ కూడా తెరమీదికి వచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే.. ఉన్నత చదువుల కోసం లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని అమెరికాకు బయలుదేరి వెళ్లాలనుకునే మధ్యతరగతి విద్యార్థులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అంత పెద్ద మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లించడం భారతీయులకు భారంగా మారుతుంది. ఇది దీర్ఘకాలంలో అమెరికా ఉన్నత విద్యా రంగానికి కూడా నష్టం కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













Click it and Unblock the Notifications