దూసుకెళ్తున్న టిడిపి, కాంగ్రెస్ జోరు: జగన్, తెరాస స్లో
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో కాంగ్రెసు పార్టీలు జోరు పెంచాయి. మధ్యాహ్నం సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ కనిపించింది. సాయంత్రానికి టిడిపి దూసుకెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య కూడా అలాగే పోటీ కనిపించినప్పటికీ ఆ తర్వాత చేతి జోరు పెంచింది.
సీమాంధ్రలో టిడిపి తన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన ఫలితాల మేరకు... టిడిపి 2481 ఎంపీటీసీలు, 21 జెడ్పీటీసీలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2005 ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసులు, కాంగ్రెసు 63 ఎంపీటీసీలను గెలుచుకుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉంది.
తెలంగాణలో కాంగ్రెసు 1151 ఎంపీటీసీలు, 34 జెడ్పీటీసీ, తెరాస 997 ఎంపీటీసీలు, 74 జెడ్పీటీసీలు, టిడిపి 484 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది. అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తెరాస, ఖమ్మం జిల్లాలో టిడిపి, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెసులు ముందంజలో ఉండగా.. వరంగల్, నిజామాబాద్లలో తెరాస, కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ కనిపిస్తోంది.