నిన్న గెలిపించి, నేడు ఓడించిన గోదావరి జిల్లాలు!
ఏలూరు: ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు గట్టి షాకిచ్చాయి. అధికార పార్టీ మద్దతుతో పోటీకి దిగిన ఎమ్మెల్సీ చైతన్యరాజు ఓటమిపాలవగా, యూటీఎఫ్ మద్దతుతో పోటీచేసిన రాము సూర్యారావు విజయం సాధించారు. తనను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించలేదన్న ఆగ్రహంతో సొంత బలంతో పోటీ చేసిన కృష్ణారావు గట్టి పోటీని ఇవ్వలేకపోయినప్పటికీ, చైతన్యరాజును దెబ్బతీయటంలో మాత్రం విజయం సాధించారు.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆధిక్యతను కనబరిచిన యూటీఎఫ్ అభ్యర్ధి రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ అదే తీరు కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చైతన్యరాజుకు ఏ దశలోనూ విజయావకాశాలు కనిపించలేదు. ప్రధాన పోటీని ఎదుర్కొంటున్న ముగ్గురు అభ్యర్ధుల్లో రాము సూర్యారావు ఆర్ధికంగా అంత బలమైన వారు కాదు.
గతంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తక్కువ తేడాతో మాత్రమే ఓటమిని చవిచూసిన యూటీఎఫ్కు ఈసారి ప్రత్యర్ధి ఓట్లలో చీలిక బాగా కలిసొచ్చింది. బలమైన అభ్యర్ధులిద్దరూ ఓట్లను చీల్చుకోవటం, యూటీఎఫ్ ఓట్లు ఎటూ పోకుండా దక్కటం వల్ల సూర్యారావు విజయం సాధించగలిగారు.
గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులు ఐక్యంగా పని చేయకపోవటం, పార్టీ నిర్ణయాన్ని పైకి సమర్ధిస్తూనే, ఎవరికి వారు తమకు నచ్చినట్టు పని చేయటం కూడా ఆ పార్టీకి నష్టం కలిగించిందంటున్నారు. ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నష్టం కలిగించిందంటున్నారు. గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించిన గోదావరి జిల్లాలే ఇపుడు తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం మూటగట్టడం విశేషం.